జగన్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్తారా?
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అత్యవసరంగా సమావేశమై పరిస్థితిపై సమీక్షించింది. జగన్ స్వస్థలం పులివెందులలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, తమ వాదన వీగిపోలేదని జగన్ తరఫు న్యాయవాది నాగేశ్వర రావు అన్నారు. తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పడానికి కూడా వీలు లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరపాలని మాత్రమే హైకోర్టు ఆదేశించిందని, అంత మాత్రాన జగన్పై మోపిన అభియోగాలు రుజువు అయ్యాయని కాదని ఆయన అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్తారా, లేదా అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
తన ఆస్తులపై ప్రాథమిక దర్యాప్తు జరపాలని ఇంతకు ముందు హైకోర్టు సిబిఐకి ఇచ్చిన అదేశాలను జగన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనపై సిబిఐ ప్రాథమిక దర్యాప్తును ఆపించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. అయితే, తాము ఈ స్థితిలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో సిబిఐ ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి హైకోర్టుకు నివేదిక సమర్పించింది.