హైకోర్టు తీర్పుపై రేపు సుప్రీంకోర్టుకు: వైయస్ జగన్
2జి స్కామ్లో మంత్రి వర్గ సభ్యుడు ఎ. రాజాను నిందితుడిగా నిలబెట్టి ప్రధాని తనకు ఏమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో మాత్రం మంత్రివర్గ నిర్ణయాలకు తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని చూపిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసులో ఉన్నంత కాలం ఏ విధమైన ఆరోపణలు చేయలేదని, మరణించిన వ్యక్తిపై ఆరోపణలు చేస్తున్నారని, అది కూడా మరణించి రెండేళ్లయిన తర్వాత చేస్తున్నారని, తన తండ్రిపై బురద చల్లుతున్నారని ఆయన అన్నారు. ఎకరా భూమి కేటాయించినా అది మంత్రి వర్గ సమిష్టి నిర్ణయమేనని ఆయన అన్నారు. తన సంస్థలు భారతి, సాక్షి, పవర్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పారదర్శకంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆ సంస్థల్లో ఎవరెవరు ఎంతెంత పెట్టుబడులు పెట్టారనే విషయాలను కూడా ఆయన వెల్లడించారు. కర్ణాటకలోని తన పవర్ ప్రాజెక్టు తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికే పూర్తయిందని ఆయన అన్నారు.
భూకేటాయింపుల విషయంలో తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు అనుసరించిన విధానాన్నే వైయస్ రాజశేఖర రెడ్డి అనుసరించారని ఆయన చెప్పారు. చంద్రబాబు గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ ఓడరేవులకు భూములు కేటాయించారని ఆయన చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ భూములు కూడా చంద్రబాబు హయాంలో కేటాయించినవేనని ఆయన చెప్పారు. చంద్రబాబు హయాంలో ఎన్నో స్కామ్లు, భూసంతర్పణలు జరిగాయని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో తాను బిజెపికి తప్ప మరెవరికీ వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. నాపై నమ్మకంతోనే తన సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని, వారికి లాభాలు కూడా పంచి ఇచ్చానని ఆయన అన్నారు. తన సాక్షి పత్రిక దేశంలోనే 9వ స్థానంలో ఉందని, ఆ అక్కసుతోనే ఈనాడు తనపై ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు.