చంద్రబాబు పాపాలాను దేవుడు చూస్తున్నాడు: జగన్
ప్రభుత్వం ఓవైపు అన్ని సంక్షేమ కార్యక్రమాలకు తిలోదకాలిస్తుంటే.. మరోవైపు ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. ''ప్రజల తరఫున పోరాడాల్సిన చంద్రబాబు ఆ విషయాన్ని మర్చిపోయారు. జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ఆయనకు ప్రజాసమస్యలు గుర్తుకువస్తాయి. చంద్రబాబుకు అసెంబ్లీకి వెళ్లినా ఈ సమస్యలు కనబడడం లేదు. వైయస్ మాత్రమే కనపడుతున్నారు. అందుకే వైయస్ రెండేళ్ల క్రితం చనిపోయిన విషయాన్ని కూడా మర్చిపోయి మహానేతపై ఇంకా బురదచల్లుతున్నారు"" అంటూ దుయ్యబట్టారు.
రాజకీయ జీవితం ఆరంభించినప్పుడు రెండెకరాలు కూడా లేని చంద్రబాబుకు ఇప్పుడు వేలకోట్లు ఎలా వచ్చాయని, హెరిటేజ్ కంపెనీలు రాష్ట్రంలోనే కాకుండా బయట రాష్ట్రాల్లో కూడా ఎలా ఏర్పాటవుతున్నాయని నిలదీశారు. ''బాబుపై అవినీతి ఆరోపణలు వస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఎంక్వైరీ వేస్తే సీబీఐని కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు. ఇప్పుడు చంద్రబాబు.. సిగ్గులేకుండా కాంగ్రెసుతో కలిసి అదే 'కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్"తో విచారణ చేయించాలని ఎలా కోరుతున్నారు. దేవుడనేవాడు మీ పాపాలను చూస్తూనే ఉన్నాడు. కాంగ్రెసు, టీడీపీల నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రెండు పార్టీలకు డిపాజిట్లు గల్లంతు అవ్వక తప్పదు"" అని ఆయన అన్నారు.