అవినీతి సాక్షిలో నాపై అడ్డగోలు రాతలు: చంద్రబాబు
కాంగ్రెసు పార్టీ అవినీతిని పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఐదేళ్ల పాటు అవినీతి విచ్చలవిడిగా రాజ్యమేలిందని, ప్రభుత్వం నుంచి లాభం పొందినవారు వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని ఆయన అన్నారు. తన కుమారుడు వైయస్ జగన్ నిర్దోషి అని వైయస్ విజయమ్మ ప్రధానికి రాసిన లేఖలో ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. గిరిజనుల భూములు లాక్కున్నారని, సెజ్ల పేర రైతుల సాగుపొలాలను లాక్కున్నారని ఆయన ఆరోపించారు. తాను కాంగ్రెసుతో కుమ్మక్కయినట్లు వైయస్ జగన్ చేసిన ఆరోపణను ఆయన ఖండించారు. కాంగ్రెసు అవినీతిని పెంచిపోషిస్తోందని, దానితో జత కట్టే ప్రశ్నే లేదని ఆయన అన్నారు.
వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని వైయస్ విజయమ్మ బొత్స సత్యనారాయణపై ఆరోపణ చేశారని, అటువంటి బొత్స సత్యనారాయణకు ప్రమోషన్లు ఇచ్చారని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు దేశాన్ని పాలించే హక్కు కోల్పోయిందని ఆయన అన్నారు. కర్ణాటకకు చెందిన గాలి సోదరులు రాష్ట్రంలోని గనులను దోచుకున్నారని ఆయన ఆరోపించారు.