ప్రత్యర్థుల చేతికి ఆయుధాన్నిచ్చిన వైయస్ విజయమ్మ
వైయస్ విజయమ్మ రాసిన లేఖలో తన కుమారుడు జగన్ నిర్దోషి అని ఎక్కడా చెప్పకపోవడాన్ని ప్రత్యర్థులు ఆయుధంగా మలుచుకున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ నాయకులు దాన్ని ఆసరాగా తీసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో మాట్లాడుతూ - విజయమ్మ తన లేఖలో తన కుమారుడు నిర్దోషి అని గానీ అవినీతిపరుడు కాడని గానీ చెప్పలేదని గుర్తు చేశారు. వి. హనుమంతరావు వంటి కాంగ్రెసు నాయకులు కూడా అదే విమర్శలు చేస్తున్నారు.
అవినీతిపరుడైన వైయస్ జగన్కు బాసటగా శాసనసభ్యులు రాజీనామాలు చేశారని కూడా వారు విమర్శిస్తున్నారు. మొత్తంగా వైయస్ జగన్ వాదన గానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల వాదన గానీ తాము తప్పు చేయలేదనే కోణంలో సాగడం లేదు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే సిబిఐ దర్యాప్తు జరుగుతోందని విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుతో కుమ్మక్కయి జగన్కు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని వారు విమర్సిస్తున్నారు. జగన్ కూడా అదే వాదన చేస్తున్నారు. ఏమైనా, జగన్ వాదన రాజకీయ కోణంలో సాగుతోందే తప్ప సిబిఐ దర్యాప్తు కోణం నుంచి సాగడం లేదు.