ప్రాణం పోయినా దీక్షపై వెనక్కి తగ్గను: అన్నాహజారే
లోకాయుక్త విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవద్దని సూచించారు. దానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రతిపాదనలు అంగీకరించాలని లేదంటే ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తానన్నారు. అవినీతిపై పోరాటం ఇది ఆరంభం మాత్రమే అని అవినీతిరహిత సమాజం కోసం సుదీర్ఘ బాటలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతిపై ప్రజల నుండి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఇప్పటికీ కేంద్రానికి అవినీతిని నిర్మూలించాలన్న చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అవినీతి నిర్మూలిస్తే తమ నోటి దగ్గర కూడు పోతుందన్న ఆలోచనలో నాయకులు ఉన్నారని విమర్శించారు. లోక్పాల్ పరిధిలోకి గ్రామస్థాయి నుండి ప్రధాని వరకు అందరూ ఉంటారన్నారు.
లోక్పాల్ ద్వారా ప్రతి పౌరుడు కేటాయింపుల్లోని సమాచారం తెలుసుకుంటాడనే భయం నేతలలో ఉందన్నారు. అవినీతిపై అన్ని స్థాయిల్లో ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. గ్రామాలే దేవాలయాలు - ప్రజలే దేవుళ్లు - వారి సేవే పరమాత్ముని సేవ అని నాయకులు, అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. విశృంఖల వ్యవస్థలో ఎక్కడా అవినీతిని నిర్మూలించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు. ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు సేవ మరిచి లంచాలకు మరిగారని విమర్శించారు. వారు తల్చుకుంటే 60 ఏళ్లుగా సాధ్యం కానిది పదేళ్లలో సాధ్యమవుతుందన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. ఆరు కేజీలు మాత్రం తగ్గానన్నారు.