వైయస్ జగన్ వైపు రాయపాటి, కావూరి?

గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు, కృష్ణా జిల్లా ఎంపీ కావూరి సాంబశివ రావు సైతం అదే బాటలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు టిటిడి చైర్మన్ పదవి ఇవ్వక పోవడంపై తీవ్ర అసంతృప్తికి గురైన రాయపాటి తాను జగన్ వైపో, టిడిపి వైపో ఎటైనా వెళ్లే అవకాశాలు ఉన్నాయని, అదంతా తన కార్యకర్తల అభిప్రాయం మేరకు ఉంటుందని మీడియా సమావేశంలో చెప్పారు. తాను చాలా ఏళ్లుగా రాయకీయాల్లో కాంగ్రెసు క్యాడర్ను జిల్లాలో నిలుపుకుంటూ వచ్చినప్పటికీ తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని ఆయన భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు.
గతంలో కేంద్రమంత్రి పదవి ఆశించారు. తాజాగా టిటిడి చైర్మన్ పదవి ఆశించారు. కానీ ఏదీ ఆయనను వరించలేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారు. కావూరి సాంబశివరావు సైతం తనకు అధిష్టాం ఏ పదవీ ఇవ్వక పోవడంపై అసంతృప్తిగానే ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్న తెలంగాణ అంశానికి చెక్ పెట్టే యోచనలో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. సోనియా గాంధీ వచ్చాక తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిఎం కిరణ్ కుమర్ రెడ్డి సైతం మరో మూడు నెలల్లో తెలంగాణ అంశం పరిష్కారమవుతుందని చెప్పారు.
తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలిస్తోంది. సమైక్య వాదాన్ని బలంగా కోరుకునే కావూరి వంటి నేతలకు ఇది మింగుడు పడని విషయం. కాంగ్రెసు పార్టీ తమకు ప్రాధాన్యత ఇవ్వక పోవడం, తెలంగాణ ప్రకటించే అవకాశాలు ఉండటం తదితర అంశాల కారణంగా కూడా కావూరి, రాయపాటి వంటి ఎంపీలు కాంగ్రెసును వీడి జగన్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరు ఎంపీలు జగన్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.












Click it and Unblock the Notifications