భయంతో విషం తాగి చస్తానన్నా: టిఆర్ఎస్ కెసిఆర్
మనం ఐక్యంగా లేకపోవడం వల్లనే రాష్ట్ర సాధన ఆలస్యమవుతుందన్నారు. తెలంగాణ ఉద్యమం విఫలమైతే తెలంగాణ ప్రజలకు మనుగడ ఉండదన్నారు. ఆంధ్రా పాలకుల వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. భౌగోళిక పరిస్థితులను బట్టి నగరాలు విస్తరించడం అభివృద్ధి కాదన్నారు. సీమాంధ్రులు తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ చేశారు. సీమాంధ్ర నేతలు తెలంగాణలో విభజించి పాలిస్తున్నారన్నారు. సీమాంధ్రులు హైదరాబాదుకు ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు గాలికి వదిలి ఆంధ్రా సీఎం ప్రభుత్వాన్ని తెలంగాణ కాంగ్రెసు నేతలు కాపాడుతున్నారన్నారు. ఇంత ఉద్యమం జరిగినా తెలంగాణ రాకపోతే సీమాంధ్రులు పాతాళంలోకి తొక్కుతారనే భయంతోనే విషం తాగి చస్తానన్నానని చెప్పారు.
తెలంగాణ లెక్చలర్లపై చెయ్యి చేసుకుంటే చెయ్యి తీసేస్తామని టిఆర్ఎస్ నేత నాయిని నర్సింహా రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ లెక్చలర్ల వల్లనే విద్యాసంస్థలు కోట్లు గడిస్తున్నాయన్నారు. తెలంగాణపై ప్రభుత్వం దిగిరాకుంటే పాలన స్థంభింపజేస్తామని ఉద్యోగ సంఘ నేతలు స్వామి గౌడ్ తదితరులు అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రతినిధులు పని చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే అందుకు తెలంగాణ మంత్రులే బాధ్యత వహించాలన్నారు. తెలంగాణపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు త్వరలో చైతన్య యాత్రలు నిర్వహిస్తామన్నారు. సోమవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇస్తామన్నారు.
ఎస్మా చట్టాన్ని సమర్థించే తెలంగాణ మంత్రులపై, ఎమ్మెల్యేలపై దాడులు జరిగితే తమకు సంబంధం లేదన్నారు. కాగా ఉద్యోగ సంఘాలు కార్యాచరణ ప్రకటించాయి. ఈ నెల 5న హైదరాబాదులో సన్నాహక సమావేశం, 7న టిజెఏసి సమావేశం, 5-9వ తేది వరకు జిల్లాల్లో రోజుకో సమావేశం ఉంటుందని చెప్పారు.