రేపే ఇండియా జన్ బంధన్ : మమత బెనర్జీ సైతం సై..!!
నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సరిగ్గా నెల రోజుల వ్యవధిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ అయిదింట్లో రెండుచోట్ల భారతీయ జనతా పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది. పశ్చిమ బెంగాల్ లో అధికారాన్ని అందుకుంది. మరో రెండు రాష్ట్రాలు.. తమిళనాడు, కేరళలల్లో నామమాత్రంగా కూడా ప్రభావాన్ని చూపలేకపోయింది బీజేపీ. కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. తమిళనాడులో ప్రభుత్వంలో భాగస్వామి అయింది.
ఈ పరిణామాల మధ్య ఇండియా బ్లాక్ కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్లో ఈ భేటీ ఏర్పాటైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి జైరామ్ రమేష్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి మొత్తం 23 రాజకీయ పార్టీలు పాల్గనబోతోన్నాయి. తాము హాజరు కాబోతోన్నట్లు ఆయా పార్టీలు ధృవీకరించాయి. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇందులో పాల్గొనబోతోంది. దీనికోసం మమత బెనర్జీ ఈ మధ్యాహ్నం కోల్ కత నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను, ముఖ్యంగా ప్రజాస్వామ్య సంస్థలు, రాజ్యాంగ విలువలు, పౌరుల హక్కులపై జరుగుతున్న దాడులను ఎండగట్టడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశ్యం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' వేదికగా జైరాం రమేష్ దీనికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. ఇండియా జన్ బంధన్ సమావేశంలో 23 రాజకీయ పార్టీలు పాల్గొంటాయని వెల్లడించారు. కొన్ని రాజకీయ పార్టీలు అనివార్యమైన వ్యక్తిగత కారణాల వల్ల ఈ భేటీకి హాజరు కాలేకపోతున్నాయని, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ బలమైన నిరసనను వారు తెలియజేసినట్లు ఆయన వివరించారు.
కేంద్ర ప్రభుత్వంపై జైరామ్ రమేష్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు సంధించారు. ప్రజల ఓటు హక్కును లాక్కోవడం, రాజ్యాంగ విలువలపై నిత్యం దాడి చేయడం, దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష నేతలను అణచివేయడం వంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆయన విరుచుకుపడ్డారు. నిత్యావసర ధరల పెరుగుదల, యువత ఉపాధి అవకాశాల దెబ్బతినడం, విదేశాంగ విధానంలో వైఫల్యాల వల్ల దేశ ప్రయోజనాలు ప్రమాదంలో పడ్డాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
2023లో ఏర్పాటైన ఇండియా కూటమి, బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. వివిధ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, భారత్ లాగే, ఇండియా జన్బంధన్ కూడా తన వైవిధ్యంతో ఐక్యంగా నిలుస్తోందని జైరామ్ రమేష్ అభివర్ణించారు. రానున్న ఎన్నికలు, ప్రజా సమస్యలు, దేశ ఆర్థిక సవాళ్లు, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంపై ఈ సమావేశంలో కూటమి నేతలు కీలక చర్చలు జరిపి, సమగ్ర భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు.












Click it and Unblock the Notifications