మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు, చిరువర్గం ఎదురుచూపు
మరోవైపు ఇటీవలే కాంగ్రెసు పార్టీలో తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన చిరంజీవి కూడా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగితే తమకు రెండు బెర్తులు వస్తాయనే ఆశతో ఉన్నారు. మంత్రివర్గంలో చిరు వర్గాన్ని చేర్పించుకునే ఆలోచన పలు కారణాల వల్ల ఆరు నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. విలీనం అధికారికంగా పూర్తయింది కాబట్టి ఇప్పటికైనా తమకు రెండు బెర్తులు వస్తాయనే ఆశతో చిరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రివర్గ మార్పులు జరిగితే తనకు హోంశాఖ కావాలని పట్టుతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ఉన్నారని సమాచారం. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు తన మనసులోని మాటను ఆయన అధిష్టానానికి నివేదించారట. దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, వట్టి వసంత్ కుమార్ తదితరులు తమ శాఖల పట్ల అసంతృప్తితో ఉన్నారు. తమకు ప్రాధాన్యత కలిగిన శాఖను అప్పగించాలని వారు బాధ్యతలు చేపట్టినప్పటి నుండే గళం వినిపిస్తున్నారు.
రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన శాఖ పట్ల అసంతృప్తితో ఉన్నప్పటికీ పిసిసి పదవి వరించడంతో ఆయన చల్లబడిపోయారు. మంత్రివర్గ మార్పులు ఎప్పుడు జరిగినా తెలంగాణ సెంటిమెంటును ముందు పెట్టి ప్రాధాన్యత కలిగిన శాఖలు, ఎక్కువ పదవులు తీసుకోవాలనే యోచనలో తెలంగాణ నేతలు ఉండగా, సీమాంధ్ర నేతలు కూడా మంత్రివర్గ మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఉద్వాసన పలికుతారనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో తెలంగాణ నేతలు పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బాన్సువాడ ఉప ఎన్నికలు, జగన్ వ్యవహారం దృష్ట్యా ఇప్పుడప్పుడే మంత్రివర్గ మార్పులు జరిగే అవకాశం లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి.