రేణుకా చౌదరిపై భగ్గుమన్న తెలంగాణ నాయకులు
సకల జనుల సమ్మె విజయవంతం కాలేదని రేణుకా చౌదరి అనడం తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరచడమేనని తెరాస శానససభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. తెలంగాణకు చెందినవారు కాకపోయినా రేణుకా చౌదరిని ఇక్కడ తెలంగాణ ప్రజలు గెలిపించారని, ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని రేణుకా చౌదరి మాట్లాడాలని ఆయన అన్నారు. రేణుకా చౌదరిని నాయకురాలని చేసింది తెలంగాణ ప్రాంతమని ఆయన అన్నారు.
రేణుకా చౌదరి తెలంగాణలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ మాటలు చెప్తే బాగుండేదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ వ్యంగ్యంగా అన్నారు. సకల జనుల సమ్మెకు వ్యతిరేకంగా రేణుకా చౌదరి మాట్లాడడం శోచనీయమని ఆయన అన్నారు. తెలంగాణలోని ప్రస్తుత పరిణామాలకు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, మంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా రేపు ర్యాలీలు, ధర్నాలు ఉంటాయని ఆయన చెప్పారు.