తెలంగాణ టీచర్స్ జెఎసి సమ్మె కొనసాగింపునకే నిర్ణయం
సమ్మె విరమించాలని తెలంగాణలోని ప్రభుత్వ విద్యాసంస్థల టీచర్లకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంతకు ముందు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణ టీచర్స్ జెఎసి నాయకులను చర్చలకు ఆహ్వానించారు. అయితే, పేరుకు మాత్రమే తమను చర్చలకు ఆహ్వానించారని తెలంగాణ టీచర్స్ జెఎసి నేతలు అభిప్రాయపడుతున్నారు. విద్యాసంస్థలను మూసేయవద్దని హైదరాబాదులోని కూకట్పల్లిలో ఆందోళనకు దిగినవారు తెలంగాణ అంతటా పర్యటించి ఆ విజ్ఞప్తి చేయాలని వారు డీమాండ్ చేశారు. తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్న సమయంలో చర్చల పేరుతో ప్రభుత్వం మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని వారంటున్నారు.
కాగా, న్యాయశాఖ తెలంగాణ ఉద్యోగులు రేపటి నుంచి (మంగళవారం నుంచి) ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు ఆబ్కారీ శాఖ తెలంగాణ ఉద్యోగులు తమ సమ్మెను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. కమిషనర్ సమీర్ శర్మతో ఎక్సైజ్ శాఖ తెలంగాణ ఉద్యోగ ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 11వ తేదీ హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి మహా ధర్నాకు పోలీసు శాఖ అనుమతి ఇచ్చింది.