టి-ఉద్యోగులపై వేటుకు సిద్ధం: సమ్మెపై ప్రభుత్వం కొరడా

ఈ చర్చలకు ఉద్యోగ సంఘాల నేతలు హాజరుకాకపోయినా... హాజరైనప్పటికీ సమ్మెపై తమ వైఖరి మార్చుకోకున్నా కొరడా ఝళిపించాలని తీర్మానించుకున్నట్లు తెలిసింది. బుధవారంనాటి చర్చలే ఆఖరని, మరోమారు సంప్రదింపులు ఉండబోవని కూడా సర్కారు సంకేతాలు పంపుతోంది. కేంద్రం తెలంగాణపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. అలాగని... ఉద్యోగుల సమ్మెను అలాగే వదిలేస్తే ఇది ఎంతకాలం కొనసాగుతుందో, ఎక్కడికి దారి తీస్తుందోనని సర్కారులో ఆందోళన మొదలైంది. అందుకే... దీనిపై కఠిన వైఖరి ప్రదర్శించాలని సర్కారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. బుధవారం నాటి చర్చల్లో తొలుత విన్నపం చేయాలని... అది ఫలించకపోతే జీవో 177 కింద ప్రాథమిక స్థాయిలో చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంది. అప్పటికీ ఉద్యోగులు దారికి రాకపోతే అదే జీవో కింద 'డిస్మిస్' వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
ముందుగా రాష్ట్ర స్థాయి నేతలపైన ఆ తర్వాత జిల్లా స్థాయి నేతలపై చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.
ఇప్పటిదాకా ఆందోళనల్లో పాల్గొన్న ఉద్యోగులను అరెస్టు చేస్తే... సొంత పూచీకత్తుపై బెయిలు ఇచ్చి విడుదల చేసేవారు. ఇకపై.. అలా కాకుండా రిమాండ్కు పంపించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకుపైగా రిమాండ్లో ఉంటే ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతారు. అవసరమైతే, గతంలో తమిళనాడు ప్రభుత్వం ఆర్టికల్ 311 కింద సమ్మెలో ఉన్న ఉద్యోగులందరినీ సస్పెండ్ చేసినట్లుగా 'సామూహిక వేటు' వేసే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకోవడంతోపాటు, విధులకు వచ్చే వారికి ఆటంకం కల్పిస్తే ఈ ఆర్టికల్ కింద చర్యలు తీసుకోవచ్చు. సుప్రీం కోర్టు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించింది. ఇక... జీవో 177ను అమలు చేయాల్సిందేనని హైకోర్టే సర్కారును ఆదేశించింది. చర్యలకు గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications