సిఎంతో ఇద్దరు టిడిపి నేతల భేటీపై సాక్షి డైలీ ట్విస్టు
ఏదైనా సమస్య మీద ముఖ్యమంత్రిని కలవడానికి మందు, కలిసిన తర్వాత హడావిడి చేసే తెలుగదుేశం నాయకులు ఈసారి అదేమీ లేకుండా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. తెలుగుదేశం నాయకులు అపాయింట్మెంట్ అడిగితే రెండు రోజులకు గానీ ఇవ్వని ముఖ్యమంత్రి కార్యాలయం అడిగిన వెంటనే ఈసారి పచ్చజెండా ఊపిందని రాసింది. తెలుగుదేశం పార్టీ నాయకులతో భేటీ కోసం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆసక్తి ప్రదర్శించారని వ్యాఖ్యానించింది. ఆయన మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా గంటసేపు తెలుగుదేశం నాయకుల కోసం నిరీక్షించారని సాక్షి పత్రిక రాసింది.
ముఖ్యమంత్రితో ఏం మాట్లాడాలో ఆ ఇద్దరు నేతలకు చంద్రబాబు పూసగుచ్చినట్లు వివరించారని, దానివల్ల చంద్రబాబు రంగారెడ్డి జిల్లాలో తలపెట్టిన రైతు పోరు బాట శుక్రవారం ఆలస్యంగా ప్రారంభమైందని రాసింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు తెలుగుదేశం నాయకులు దాదాపు గంటపాటు ముఖ్యమంత్రితో చర్చించారని అంటున్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు మనుషులు అటు ఢిల్లీలోనూ ఇటు హైదరాబాదులోనూ ప్రయత్నాలు చేస్తున్నారని సాక్షి దినపత్రిక రాసింది. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి గవర్నర్ నరసింహన్ను కూడా కలిశారని సాక్షి చెప్పింది.