ప్రభుత్వం చెప్పుచేతల్లో సిబిఐ: చంద్రబాబు ఆరోపణ
తమ ప్రభుత్వ హయాంలో తప్పు జరగలేదని, తప్పులు చేయడానికి అధికారులు భయపడ్డారని ఆయన చెప్పుకున్నారు. పార్టీలు, రాజకీయ నాయకులు ముఖ్యం కాదని, దేశం ముఖ్యమని ఆయన అన్నారు. కాంగ్రెసు పద్ధతులు సరిగా లేవని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. అవినీతిరహిత భారతదేశాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇందుకు పటిష్టమైన లోక్పాల్ బిల్లు అవసరమని ఆయన అన్నారు.
మొన్నటి వరకు మైనింగ్ మాఫియా, నిన్న మద్యం మాఫియా, ఇప్పుడు ఇసుక మాఫియా - ఇలా మాఫియాలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం మాఫియాలకు అండగా నిలుస్తోందని ఆయన విమర్శించారు. మంత్రి శంకరరావుపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాడులను సమర్థించే పరిస్థితి ఉందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. ఎవరికి వారు అకౌంట్లను సెటిల్ చేసుకుంటున్నారు తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. మైనింగ్ అక్రమాల గురించి తనకు తెలియదని సబితా ఇంద్రా రెడ్డి అనడం సరి కాదని ఆయన అన్నారు.