తెలంగాణపై జగన్:సురేఖ కోసమని సీమాంధ్ర నేతల ఫైర్

కెసిఆర్తో జగన్ కుమ్మక్కై వైఎస్ ఆశయాలను తుంగలో తొక్కాడని, నాటి ఎన్నికలప్పుడు నంద్యాల సభలో వైఎస్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే వీసా అవసరం ఉండకూడదంటే ప్రజా తీర్పు స్పష్టంగా ఉండాలని కోరారని, ఆ విషయం జగన్కు గుర్తులేదా? అని వీర శివా రెడ్డి ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో పరకాల నుంచి కొండా సురేఖ విజయం కోసమే తెలంగాణలో జగన్ పోటీ వద్దనుకుంటున్నారన్నారన్నారు. ఈ నిర్ణయంతో జగన్ పిరికితనం బయటపడిందన్నారు. జగన్ కుప్పిగంతులు మానుకోవాలని, తెలంగాణపై విధానం ఏమిటో స్పష్టంగా ప్రకటించాలని, వైఎస్ సమైక్యవాదని, కానీ మాట తప్పం, మడమ తిప్పం అనే నువ్వు నీ స్వార్థం కోసం మాట మార్చావని ధ్వజమెత్తారు.
ఉప ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం ద్వారా సీమాంధ్ర ప్రాంతానికి జగన్ ద్రోహం చేశారని ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. వైఎస్ సమైక్యవాది, ఆయన కొడుకైన జగనేమో రాయలసీమ, ఆంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ పాదాల వద్ద వాల్చాడని, జగన్ ఆంధ్రా ప్రాంత ద్రోహి అని, పదవి కోసం కెసిఆర్తో లాలూచీ పడ్డాడని, దీంతో వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని ఆనం వివేకానంద రెడ్డి విమర్శించారు. తెలంగాణ వస్తే హైదరాబాద్కు పాస్పోర్టుతో రావాల్సిందేనని నాడు వైఎస్ మాట్లాడితే ఇప్పుడు జగన్ మాత్రం తెలంగాణ సెంటిమెంట్ను గౌరవించి అక్కడ పోటీ పెట్టడం లేదని చెప్పడం చూస్తే సాక్షాత్తూ తండ్రి మాటనే వైఎస్ తనయుడు పక్కనపెట్టారన్న సంగతి వెల్లడవుతోందని 20 సూత్రాల అమలు పథకం చైర్మన్ ఎన్.తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.
నాడు పార్లమెంట్లో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకుని జగన్ నినాదాలు చేశారని గుర్తు చేశారు. అలాంటి జగన్ ఇప్పుడేమో తెలంగాణలో తమ పార్టీ పోటీ చేయదని చెబుతున్నారంటే ఇది మడమ తిప్పడం కాక మరేమిటని ప్రశ్నించారు. తెలంగాణలో ఓదార్పు పర్యటన కోసమే జగన్ ఇలా ప్రకటించారని పేర్కొన్నారు. జగన్ సమైక్యాంధ్ర వ్యతిరేకి అనే విషయం ఆయన ప్రకటనతో వెల్లడైందని మంత్రి శైలజానాథ్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే జగన్ రాష్ట్ర విభజనకు ఒప్పుకొన్నట్లేనని వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్తో ఆయన చేసుకున్న ఒప్పందం బయటపడిందని మండిపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైఎస్ ఆకాంక్షించారని ఈ సందర్భంగా శైలజానాథ్ జగన్కు గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications