హద్దులు దాటొద్దు: విజయ సాయి రెడ్డికి జడ్జి క్లాస్
ఈ సందర్భంగా సిబిఐ తరఫు న్యాయవాది మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఆయనే ప్రథమ ముద్దాయి అన్నారు. వైయస్ సివిల్ సర్వెంట్ అని, ఇంకా ఎవరి పేర్లు కావాలన్నారు. కాగా మంగళవారం కూడా సిబిఐ న్యాయమూర్తి విజయ సాయి రెడ్డిని హెచ్చరించారు. వాదనను తానే వినిపించుకునేందుకు సిద్దమైన సాయి రెడ్డిని న్యాయమూర్తి నిలువరించారు. అంత ఆత్రుత వద్దంటూ పరోక్షంగా కట్టడి చేశారు. సాయిరెడ్డిని కోర్టులో హాజరు పర్చినప్పుడు ఆయన తరఫు న్యాయవాది వాదనలు ప్రారంభించారు. ఈ సమయంలో అనేక సందర్భాల్లో సాయి రెడ్డి జోక్యం చేసుకొని తన వాదన తానే వినిపించే ప్రయత్నం చేశారు.
తనను వీడియో కాన్ఫరెన్సు ద్వారా కాకుండా కోర్టుకు హాజరవడం ద్వారా విచారణ చేయాలని అభ్యర్థించారు. తనపై సిబిఐ చేసిన ఆరోపణలన్నీ అబద్దమని, పేర్కొన్న సెక్షన్లు తనకు వర్తించవన్నారు. దీనిపై సిబిఐ న్యాయవాది ఘాటుగా స్పందిస్తూ సిబిఐ చట్ట ప్రకారమే వెళుతోందని, సిబిఐపై ఆరోపణలు చేస్తున్న మీరు, మీ న్యాయవాది కలిసి సొంతగా చట్టాలు తయారు చేసుకోండని సూచించారు. ఓ సమయంలో సాయిరెడ్డిని ఉద్దేశించి మనకు ఎంత ఆత్రుత ఉండాలో అంతే ఉండాలన్నారు. దాంతో సాయిరెడ్డి వెనక్కి తగ్గారు.