మీరు రాకుంటే పరువు పోతుంది!: ప్రధానికి బొత్స విజ్ఞప్తి
అలాగే, మరిన్ని రాజకీయాంశాలపై కూడా ప్రధానితో పిసిసి చీఫ్ చర్చించినట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో వరి ధాన్యం మద్దతు ధరను క్వింటాలుకు రూ.200 చొప్పున పెంచాలని ప్రధానిని బొత్స కోరారు. దేశవ్యాప్తంగా పంటలకు కేంద్రం నిర్ణయించే కనీస మద్దతు ధరను ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా నిర్ధారించాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడి ఖర్చులు, కూలీ రేట్లు పెరిగినందున వరి ధాన్యానికి అదనంగా రూ.200 మద్దతు ధర ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. క్వింటాలుకు రూ.1300 మద్దతు ధర లభిస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుందన్నారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల పథకాలు రెండింటికీ జాతీయ హోదా కల్పించాలని కోరారు. పట్టణాలు, నగరాల్లో ప్రజా రవాణాను మెరుగు పర్చేందుకు జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద కేంద్రం నిధులు ఇస్తోందని, ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాలకు సైతం కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ఆర్టీసికి కేంద్రం సాయం చేయాలని అడిగారు. గ్రామీణ ప్రాంతాల మధ్య రోడ్డు సదుపాయాన్ని మెరుగుపర్చేందుకు అధికంగా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుపై వ్యతిరేకత వ్యక్తం కావటానికి ప్రధాన కారణం పునరావాస ప్యాకేజీ ఆకర్షణీయంగా లేకపోవటమేనని ప్రధానికి బొత్స తెలిపారు.