వైయస్ విజయమ్మను టార్గెట్ చేసిన టిడిపి నేతలు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికీ లేదని, ఆయన పాపాలే ఆయనను చంపుతాయని తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివ ప్రసాద్ మంగళవారం గుంటూరులో మంగళవారం అన్నారు. జగన్ ఇప్పటికైనా అప్రూవర్గా మారితే మంచిదన్నారు. లేకుంటే ఎమ్మార్ కేసులో అరెస్టైన సునీల్ రెడ్డియే గుట్టు అంతా విప్పుతారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సిబిఐ దర్యాఫ్తును తప్పు పడుతూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు లేఖ రాయడం బాధాకరమని మరో టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు తిరుపతిలో అన్నారు.
ఎంపి జగన్ అరెస్టులో విచారణ నత్తనడకన సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని మంత్రులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మార్కు భూముల కేటాయింపులో వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని తుంగలో తొక్కారని ఆరోపించారు. వైయస్ విజయమ్మ లేఖ సరికాదని మరో నేత దేవేందర్ గౌడ్ వేరుగా హైదరాబాదులో అన్నారు.