ఢిల్లీలో సిబిఐ జెడి బిజీబిజీ, తదుపరి అరెస్టు ఎవరిది?
జెడి లక్ష్మీ నారాయణ మొదటిసారి ఢిల్లీ వెళ్లి వచ్చాక, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సాక్షి వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి అరెస్టు జరిగింది. ఆ తర్వాత రెండోసారి ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చాక, ఎమ్మార్ కేసులో వరుస అరెస్టులు జరిగాయి. ఎమ్మార్ కేసులో జగన్ సన్నిహితుడిగా పేరుపడ్డ సునీల్ రెడ్డి, బిపి ఆచార్య, విజయ రాఘవన్లు అరెస్టయ్యారు. అంతకుముందే ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్ అరెస్టయ్యారు.
తాజాగా ఆయన మరోసారి ఢిల్లీ వెళ్లారు. గాలి గనుల కేసు, జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్ కేసులను దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ ఇప్పటికే గాలి, ఎమ్మార్ కేసులలో ఛార్జీషీట్ను కోర్టుకు సమర్పించింది. జగన్ ఆస్తుల కేసులో మాత్రమే ఛార్జీషీట్ సమర్పించవలసి ఉంది. ఇటీవలి కాలంలో ఈ కేసుల విచారణను వేగవంతం కూడా చేసింది. విజయ సాయి రెడ్డి నుండి మొదలు సునీల్ రెడ్డి వరకు పలువురి అరెస్టులు సైలెంట్గానే జరిగి పోయాయి. ఈ నేపథ్యంలో సిబిఐ జెడి హైదరాబాద్ వచ్చాక అరెస్టుల పర్వానికి మరోసారి తెరలేవ వచ్చునని, అయితే అవి ఎవరివనే ప్రశ్నలు పలువురిలో తలెత్తుతున్నాయి.