నేను చేసిన తప్పు ఒక్కటే, మాట తప్పలేదు: జగన్
మరణించిన వైయస్ రాజశేఖర రెడ్డిపై బురద చల్లడానికి రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ ఏకమయ్యాయని ఆయన అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఏకమై తనపై కుట్రలు చేస్తున్నాయని ఆయన అన్నారు. దేశంలోనే వైయస్ రాజశేఖర రెడ్డి వంటి ముఖ్యమంత్రి లేరని ప్రశంసించిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ తనను ప్రత్యర్థిగా భావిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో రెండు పార్టీలు మాత్రమే ఉండాలని తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు భావించి ఏకమైన తనపై సమరం సాగిస్తున్నాయని ఆయన అన్నారు. అయితే, దేవుడు అన్నీ చూస్తున్నాడని, ఎన్నికలు వస్తే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు దక్కవని ఆయన అన్నారు. మరణించిన వైయస్ రాజశేఖర రెడ్డికి ఓ న్యాయం, బతికున్న చంద్రబాబుకు మరో న్యాయం అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడానికి రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. బతికున్నప్పుడు ఒక్క మాట కూడా అనని కాంగ్రెసు నాయకులు ఇప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని 25 మంది మంత్రులకు, 40 మంది శాసనసభ్యులకు మద్యం సిండికేట్లతో సంబంధాలున్నాయని, ఒక్క మంత్రిని మాత్రమే చూపిస్తున్నారని ఆయన అన్నారు. ఎసిబి నివేదికను ప్రభుత్వం తొక్కి పడుతోందని ఆయన విమర్శించారు. తనకు అనుకూలమైన సమాచారాన్ని మాత్రమే విడుదల చేస్తోందని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై మాత్రమే సభా సంఘం వేయడాన్ని ఆయన తప్పు పట్టారు. చంద్రబాబు, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల హయాంలో జరిగిన భూకేటాయింపులను కూడా విచారణ పరిధిలోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు నాయకులు, చంద్రబాబు ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు.