జగన్ ఆస్తుల కేసు: మోహన్ కందాను ప్రశ్నించిన సిబిఐ
శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు సిబిఐ అధికారులు మోహన్ కందాను ప్రశ్నించారు. నాలుగైదు రోజుల తర్వాత తనను రావాలని అడిగారని, అయినా ముందే తాను వచ్చానని మోహన్ కందా చెప్పారు. వైయస్ ప్రభుత్వ హయాంలో ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన సీనియర్ ఐఎఎస్ అధికారులను సిబిఐ ప్రశ్నిస్తోంది. అందులో మోహన్ కందా మూడో వారు. ఇప్పటికే సిబిఐ రమాకాంత్ రెడ్డిని, రఘోత్తమ రావును ప్రశ్నించింది. తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాలంలో జారీ అయిన కొన్ని జీవోలకు సంబంధించి సీబీఐ అధికారులు వివరాలు అడిగారని మోహన్ కందా తెలిపారు. జీవోల జారీ సమయంలో బిజినెస్ రూల్స్ పాటించారా లేదా అనే విషయాలను సీబీఐ తెలుసుకుందని మోహన్ కందా తెలిపారు. వారు కోరిన సమాచారం తెలియజేశానన్నారు. తనకు వీలైన సమయంలోనే సీబీఐ కార్యాలయానికి రావాలని అధికారులు కోరారని కందా చెప్పారు.
కాగా, జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ, సిటీ బ్యాంక్ అధికారులు సీబీఐ ముందు హజరయ్యారు. ఎమ్మార్ కేసుకు సంబంధించి సాక్షిగా ఉన్న జగన్నాథం సీబీఐ ముందు హాజరై కొన్ని వివరాలు అందచేసినట్లు సమాచారం.