వైయస్ జగన్ సాక్షికి లీగల్ నోటీసు ఇస్తా: లగడపాటి
సోమవారం కృష్ణా జిల్లా నందిగామ మండలం దాములూరు గ్రామంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అసత్య కథనాలు ప్రచురించకుడా ఉండేందుకు తాను ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. ఇప్పటికే తన కార్యాలయాలలో జగన్ పత్రికను నిషేధించానని, కార్యకర్తలకు కూడా అదే సలహా ఇస్తున్నానని చెప్పారు. రాజకీయ నాయకులు, వ్యాపారుల చేతుల్లో మీడియా ఉండడం వల్ల భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదురౌతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపార, రాజకీయ రంగాలలో ఉన్న వారు మీడియాలోకి, మీడియాలో ఉన్న వారు రాజకీయాలలోకి రాకుండా ఉండేందుకు వచ్చే పార్లమెంట్ సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తానన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన తమ పార్టీ శానససభ్యులపై మార్చిలోగా అనర్హత వేటు పడుతుందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. 2014 ఎన్నికల్లో కూడా తాను విజయవాడ నుంచే పార్లమెంటుకు పోటీ చేస్తానని ఆయన చెప్పారు. భవానీ ఐలాండ్ టెండర్లలో అక్రమాలు జరిగి ఉంటే అప్పుడే ఎందుకు అడ్డుకోలేదని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నించారు. మంత్రి గంటా శ్రీనివాస రావు తెలుగుదేశంలో ఉన్నప్పటి నుచే వ్యాపారవేత్త అని ఆయన చెప్పారు.