మదర్సాల లెక్కలు తీస్తోన్న సువేందు: ఏం చేస్తారో గానీ
పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వరుసగా సంచలన నిర్ణయాలను తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మదరసాలపై సమగ్ర సమీక్షను ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భాగంగా తమ పరిధిలో ఉన్న మదరసాల గురించి, సమగ్ర, వివరణాత్మక నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించింది. జులై 5వ తేదీ నాటికి సమర్పించాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది.
రాష్ట్రంలోని మైనారిటీ వ్యవహారాలు, మదరసా విద్యాశాఖ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సమీక్షను ఓ సాధారణ పరిపాలనా ప్రక్రియగా పేర్కొంది. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన మొదటి సర్వే ఇదే కావడం గమనార్హం. గతంలో 2002 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ కూడా గుర్తింపు లేని ఖారిజీ మదరసాలను పర్యవేక్షించేందుకు ప్రయత్నించారు గానీ మతపరమైన సంస్థలు, వామపక్ష భాగస్వాముల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం బెంగాల్ ప్రభుత్వ పర్యవేక్షణలో 614 ఎయిడెడ్, 601 అన్ ఎయిడెడ్ మదరసాలు నడుస్తున్నాయి. వీటితో పాటు 14 ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ మదరసాలు కూడా ఉన్నాయి. వీటిల్లో సుమారు 5.5 లక్షల నుండి 6 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రభుత్వం గుర్తించిన ఈ సంస్థల కంటే, ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థల ఆధ్వర్యంలో నడిచే మదరసాలే ఇప్పుడు ప్రధానాంశంగా ఉన్నాయి. వాటి గురించే ప్రభుత్వం సర్వే చేయిస్తోందని అంటున్నారు.
మక్తాబ్ లేదా ఖారిజీ మదరసాలుగా పిలిచే ఈ సంస్థలు సమాజంలోని వివిధ వర్గాల సహకారంతో కార్యకలాపాలు కొనసాగిస్తోన్నాయి. పేద విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, వసతి కల్పించే ఈ మదరసాలు ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్పూర్, దక్షిణ 24 పరగణాలు, బీర్భూమ్ జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్నాయి. వీటిపై అధికారిక లెక్కలు లేనప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా 1,000కి పైగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఈ తాజా సర్వేలో భాగంగా మదరసాల స్థాపన తేదీ, రిజిస్ట్రేషన్ స్థితి, నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది వివరాలను కలెక్టర్లు సేకరించాలి. అలాగే అవి నివాస యోగ్యమైనవా లేదా ప్రైవేట్ సహకారంతో నడుస్తున్నవా, అక్కడ బోధిస్తున్న పాఠ్యప్రణాళిక ఏమిటనే అంశాలపై స్పష్టమైన నివేదికలు అందించాలి. భవిష్యత్తులో విద్యా ప్రణాళికలు, సంక్షేమ పథకాలను రూపొందించడానికి ఈ సమాచారం అవసరమని ప్రభుత్వం పేర్కొంది.
బెంగాల్లో మదరసా విద్యా వ్యవస్థ వేళ్లూనుకోవడానికి 1780లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించిన కలకత్తా మదరసా ప్రధాన కారణం. 1994లో వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ మదరసా ఎడ్యుకేషన్ చట్టం అమలులోకి వచ్చాక, ఈ సంస్థలకు విద్యా, పరిపాలనా, ఆర్థికాధికారాలతో పాటు చట్టబద్ధత లభించింది. 2002లో బుద్ధదేవ్ భట్టాచార్జీ మదరసాలపై నిఘా పెట్టాలని ప్రయత్నించినప్పుడు, కోల్కతాలోని అమెరికన్ సెంటర్ దాడిని కారణంగా చూపిస్తూ, ఇవి విదేశీ నిధులతో రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications