తెలంగాణ వస్తే దళిత నేతనే ముఖ్యమంత్రి: కెసిఆర్
దళిత సంఘాలు నిర్మాణాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల నిధులను పక్కదారి పట్టించారని, అయినా దళిత సంఘాలు మాట్లాలేదని, ఇటువంటి విషయాలపై పోరాటాలు చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ఇందిరా గాంధీని రాజకీయంగా బతికించింది దళితులేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాలేసి భూమి ఇస్తామని ఆయన చెప్పారు. దళితులను ఎలా పైకి తేవచ్చో వివరిస్తూ ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు ఉండవని, అందరూ ఒకే దగ్గర ఉంటారని ఆయన చెప్పారు. కెజి నుంచి పిజి దాకా ఉచిత విద్యను అందిస్తామని ఆయన చెప్పారు. దళితుల వద్దకే మనం వెళ్లాలని, వారి అవసరాలు ఏమిటో చూడాలని ఆయన అన్నారు. శాసనసభ్యుడిగా తాను దళితుల కోసం ఎలా పని చేసిందీ, వారి అభిమానాన్ని ఎలా చూరగొందీ వివరించారు. తాను ఎన్నికల్లో డబ్బులు, సారా పంచలేదని, ప్రజల అభిమానంతోనే గెలిచానని ఆయన అన్నారు.