ఇకనైనా ఆపాలి, విజయమ్మ క్షమాపణ చెప్పాలి: టిడిపి
విజయమ్మ కేసు వేసినప్పుడు చంద్రబాబు బాధపడలేదని, ఇప్పుడు సంతోషపడటం లేదని పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇలాండి ఒడిదుడుకులు ఉంటాయని ఆయనకు తెలుసునన్నారు. తీర్పు ద్వారా బాబుపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలు అని తేలిపోయిందన్నారు. ఈ తీర్పు చారిత్రాత్మకం అన్నారు. జగన్ ఆస్తులు, వైయస్ అక్రమాలు త్వరలో కోర్టుకు తేలనున్నాయన్నారు. అవినీతిపరులు కోర్టుకు రాక తప్పదన్నారు. హైకోర్టు తీర్పు జగన్ పార్టీకి ఎదురు దెబ్బ అని దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఆ పార్టీ నేతలు ఇకనైనా బాబుపై విమర్శలు ఆపాలన్నారు. విజయమ్మ దురుద్దేశ్యంతోనే పిటిషన్ వేశారని రావుల చంద్రశేఖర రెడ్డి ఆరోపించారు. జగన్ ఆస్తులను పేదలకు పంచిపెట్టాలని, విజయమ్మ క్షమాపణ చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బురదజల్లేందుకు పిటిషన్ వేశారని మరోనేత యనమల రామకృష్ణుడు అన్నారు. కాగా టిడిపి నేతలు బాబుకు మిఠాయి తినిపించారు.