కాంగ్రెసును బొంద పెడదాం: టిడిపికి హరీష్ సూచన
తెలుగుదేశం తెలంగాణ నాయకులు సొల్లు పురాణం వినిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభలో తెలంగాణ తీర్మానం ప్రతిపాదించాలంటే అధికార కాంగ్రెసు ముందుకు రావడం లేదని, తెలుగుదేశం పార్టీ తమకు మద్దతు ఇవ్వడం లేదని, రెండు పక్షాలు కుమ్మక్కయి తెలంగాణ తీర్మానం రాకుండా చూస్తూ సభను వాయిదా వేసుకుని పారిపోతున్నాయని ఆయన అన్నారు. ఇప్పుడే తీర్మానం పెట్టాలని తాము అడగడం లేదని, శానససభ సమావేశాలు ముగిసే లోగా తీర్మానం పెడతామని తేదీ ఇవ్వాలని అడుగుతున్నామని ఆయన అన్నారు. తెంలగాణ తీర్మానం ప్రవేశపెట్టే వరకు పట్టుబడుతామని ఆయన చెప్పారు.
ఉప ఎన్నికలు బహిష్కరించాలని తెలుగుదేశం తెలంగాణ నాయకులు చేస్తున్న సూచనను ఆయన వ్యతిరేకించారు. ఉప ఎన్నికలను బహిష్కరిస్తే తెలంగాణ రాదని, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను బహిష్కరిస్తే, ఉప ఎన్నికల్లో ఆ పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేస్తే తెలంగాణకు దగ్గరవుతామని, సోనియా చంద్రబాబు కళ్లు తెరుస్తారని ఆయన అన్నారు. ఎన్నికలను ఎదుర్కోలేకనే బహిష్కరించాలని తెలుగుదేశం నాయకులు సూచిస్తున్నారని ఆయన అన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే ఖర్మ తమ పార్టీకి పట్టలేదని, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ఆ ఖర్మ పట్టిందని ఆయన అన్నారు. తమ పార్టీ లక్ష్యమే తెలంగాణ రాష్ట్ర సాధన అని ఆయన అన్నారు. రాజకీయమూ అధికారమూ ఆశించి పనిచేయడం లేదని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్నామని ఆయన అన్నారు.