ఎన్టీఆర్, బాలకృష్ణలే అధ్యక్షువులవుతారు: కెసిఆర్
పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబే ఉన్నారని, వీటిలో ఓ పదవిని తెలంగాణవారికి ఇవ్వవచ్చు కదా, కానీ ఇవ్వరని ఆయన అన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టానని చంద్రబాబు అనడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తాము బిక్షగాళ్లం, మీరు బిక్షం వేసేవారా అని ఆయన అడిగారు. తెలంగాణవారిని బిక్షగాళ్ల మాదిరిగానే చంద్రబాబు చూస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు, సిపిఐ, బిజెపిలో పార్టీ అధ్యక్షులుగా తెలంగాణ నేతలు ఉన్నారని, వాటిలో అవకాశం ఉందని, తెలుగుదేశం పార్టీలో తెలంగాణవాళ్లు పార్టీ అధ్యక్షులు కావడం ఈ జన్మలో కుదరదని ఆయన అన్నారు.
తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలు తెలంగాణ బానిసల ఫోరం పెట్టుకోవాలని ఆయన అన్నారు. నాయకులకు స్వేచ్ఛ ఇచ్చానని చంద్రబాబు అంటున్నారని, రాజ్యాంగపరంగా స్వేచ్ఛ ఉందని, అలా ఉన్నప్పుడు తాను స్వేచ్ఛనిచ్చానని చెప్పడం చంద్రబాబు ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు. కోవూరులో తాము పోటీ చేయడం ఖాయమని, రేపు అభ్యర్థిని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. కోవూరు నియోజకవర్గంలో తాను ప్రచారం చేస్తానని, అక్కడ చంద్రబాబు బాగోతాలు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాను రోడ్డు మార్గం ద్వారానే కోవూరు వెళ్తానని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తినే కోవూరు అభ్యర్థిగా ఖరారు చేస్తామని, పార్టీ ఇంచార్జీలను కూడా నియమిస్తామని ఆయన చెప్పారు.