హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి డబ్బులు, జగన్ డైరెక్షన్: కెసిఆర్‌పై మోత్కుపల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mothukupally Narasimhulu
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి డబ్బులతో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ డైరెక్షన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నడుస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కెసిఆర్‌పై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో నిప్పులు చెరిగారు. తెరాస ఎన్నికల ఖర్చును గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్ భరిస్తున్నారని ఆయన ఆరోపించారు. జయశంకర్‌ను లోపల అవమానించి, బయట కాళ్లు పట్టుకున్నారని, గడ్డి తింటున్నారా అని ఆయన కెసిఆర్‌‍ను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ వస్తే మావోయిస్టు ఎజెండాను అమలు చేస్తానని చెప్పిన కెసిఆర్ గద్దర్‌నే ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాడని ఆయన అన్నారు.

కెసిఆర్ వలసవాది అని అర్థమైందని, విజయశాంతిని రాజమండ్రి నుంచి తీసుకొచ్చారని, తెలంగాణ రాకూడాదనేది కెసిఆర్ ఎజెండా అని ఆయన అన్నారు. కెసిఆర్ రాజకీయాల్లో అడ్డా కూలీ అని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ రాజకీయ బ్రోకర్ అని, ఎవరు డబ్బిస్తే వారికి మద్దతిస్తారని ఆయన అన్నారు. నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి కెసిఆర్ మోసం చేశారని ఆయన అన్నారు. కెసిఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని సోనియా కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని, సోనియా కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటున్నారని ఆయన అన్నారు. సోనియాతో, ప్రధాని మన్మోహన్‌తో కెసిఆర్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకే కాంగ్రెసును విమర్శించడం లేదని ఆయన అన్నారు. సోనియాకు కాపలా కుక్కలా పనిచేస్తున్నారని ఆయన అన్నారు.

సిగరెట్టుకు కూడా డబ్బులు లేని కెసిఆర్ ఇప్పుడు ఎంత సంపాదించారని ఆయన అన్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు కోటి రూపాయల విలువ చేసే కారులో తిరుగుతున్నారని ఆయన అన్నారు. 214 ఎన్నికల దాకా కాంగ్రెసు, జగన్ ఆడించినట్లుగా ఆడాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణను కెసిఆర్ వ్యాపారంగా మార్చుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసును పల్లెత్తు మాట అనని కెసిఆర్ తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపైనే ఎందుకు విమర్శలు చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కెసిఆర్ అమ్ముడుపోయాడని, విద్యార్థుల రక్తంతో రాజకీయంగా ఎదిగారని ఆయన అన్నారు.

కెసిఆర్‌కు ఢిల్లీలో భూములు, గుజరాత్‌లో షిప్పులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. గాలి జనార్దన్ రెడ్డి కెసిఆర్‌కు వేయి కోట్ల రూపాయలు ఇచ్చాడని ఆయన ఆరోపించారు. ఎందుకు కెసిఆర్ కాంగ్రెసుకు అమ్ముడుపోయాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చే శక్తి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు లేదని, కాంగ్రెసుకు ఇచ్చే శక్తి ఉందని, ఇవ్వగలిగే శక్తి లేని చంద్రబాబును విమర్శిస్తూ, ఇవ్వగలిగే కాంగ్రెసును కెసిఆర్ వదిలేస్తున్నారని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే శానససభలో తెలంగాణ తీర్మానం పెడతామని, తెలంగాణకు వ్యతిరేకమని చంద్రబాబు చెప్పలేదని ఆయన అన్నారు.

English summary
Telugudesam Telangana region MLA Mothkupalli Narasimhulu retaliated TRS president K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X