వైయస్పై కిక్కురుమనడు: కెసిఆర్పై చంద్రబాబు
మంత్రి పదవి ఇవ్వలేదని కేసీఆర్ పార్టీ పెడితే, సీఎం పదవి దక్కలేదని జగన్ ఇంకో పార్టీ పెట్టారని, వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు లాలూచీ నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్ళిద్దరు ఒకరినొకరు విమర్శించుకోరని ఆయన అన్నారు. ఉద్యమం పేరు చెప్పి దౌర్భాగ్యమైన పనులు చేస్తున్నారని, రాజకీయంగా జన్మనిచ్చిన టీడీపీని ఫినిష్ చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారని, రాజకీయంగా విభేదించవచ్చు గానీ, ఇదేం భాష అని ఆయన అన్నారు. తెరాస, జగన్ పార్టీలు ఒక్కొక్కటి ఒక్కో ప్రాంతానికే పరిమితమని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గెలవగలిగిన ఏకైక పార్టీ టీడీపీ ఒక్కటేనని ఆయన అన్నారు.
రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే తెలంగాణ వస్తుందా అని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను చంద్రబాబు ప్రశ్నించారు. 'తెలంగాణలో జరుగుతున్నవి వరుసగా మూడో ఉప ఎన్నికలు. పోటీచేసిన ప్రతిసారీ తెలంగాణ వస్తుందని చెబుతున్నారు. వచ్చిందా?'' అని నిలదీశారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే రాజీనామాల నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. కొందరికి ఎన్నికలు కూడా వ్యాపారంగా మారాయని, ఎలెక్షన్ల పేరుతో కలెక్షన్లు చేసుకొంటున్నారని కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాజీనామాలు చేసినట్లే చేసి మళ్ళీ పోటీకి పరిగెత్తుకొస్తున్న నాయకులను ఒకసారి చిత్తుగా ఓడించి మళ్ళీ ఇటువంటి నాటకాలు ఆడకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే మధుసూదనరావు తన అనుచరులతో వచ్చి ఎన్టీఆర్ భవన్లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి చంద్రబాబు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. "ఉప ఎన్నికల తర్వాత ఇక తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోవు. మళ్ళీ టీఆర్ఎస్ అటువంటి ధైర్యం చేయబోదు. ఆ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు'' అని జోస్యం పలికారు. నాగం జనార్దన్ రెడ్డిపై కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.