కొల్లాపూర్లో జూపల్లి వర్సెస్ డికె!, స్టేషన్లో గట్టి పోటీ
ఆదిలాబాద్ ఉప ఎన్నికను కాంగ్రెస్, టిడిపి, టిఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారంలో అన్ని పార్టీలు తెలంగానాన్నే ఆలపించాయి. టిడిపికి చెందిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో తాము ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో టిడిపి భారీ ప్రచారం నిర్వహించింది. తమ అభ్యర్థి శంకర్కు మద్దతుగా టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ తెలంగాణ ఫోరం నేతలు ప్రచారం చేశారు. జోగు రామన్నను గెలిపించుకోవాలనే లక్ష్యంతో టిఆర్ఎస్ కూడా పెద్దఎత్తున ప్రచారం చేపట్టింది. కెసిఆర్తో పాటు విజయశాంతి, ఎమ్మెల్యేలు అరవింద్ రెడ్డి, ఓదెలు, సమ్మయ్య, రసమయి బాలకిషన్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి సి రాంచంద్రా రెడ్డికి మద్దతుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు, నేతలు ప్రచారం చేశారు. మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల విజయంపై ధీమాతో ఉన్నాయి.
తెలంగాణ కోసం జూపల్లి కృష్ణారావు చేసిన రాజీనామాతో ఉప ఎన్నిక జరుగుతున్న కొల్లాపూర్లో అభ్యర్థుల ఆశలన్నీ సెంటిమెంట్పైనే ఉన్నాయి. టిఆర్ఎస్లో చేరిన జూపల్లి రాజకీయ భవితకు ఈ ఎన్నిక పరీక్షగా మారింది. కాంగ్రెస్ నుంచి జూపల్లి బయటకు వచ్చి టిఆర్ఎస్ తరఫున బరిలోకి దిగగా ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి టిఆర్ఎస్కు గుడ్బై చెప్పి సొంతగూటికి చేరుకున్నారు. జిల్లా మంత్రి డికె అరుణ పట్టుబట్టి మరీ విష్ణుకు టిక్కెట్టు ఇప్పించారు. ఇక్కడ కాంగ్రెస్, టిఆర్ఎస్ల మధ్య పోటీ అనే కన్నా, జూపల్లి, డికె అరుణల మధ్య పోటీ ఉందనవచ్చు. కొల్లాపూర్లో కాంగ్రెస్ ప్రచార బాధ్యతను అరుణ ఒంటిచేత్తో నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన టిడిపి అభ్యర్థి జగదీశ్వర్ రావు ఈసారి సానుభూతిపై ఆశలు పెట్టుకున్నారు. టిడిపి, కాంగ్రెస్, టిఆర్ఎస్తో పాటు సిపిఎం కూడా పోటీలో ఉండటంతో ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కామారెడ్డిలోనూ పోటీ పోటీ నెలకొని ఉంది. కాంగ్రెసు, టిడిపి, టిఆర్ఎస్ల నుండి రాజారెడ్డి, వేణుగోపాల రావు, గంప గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. తమ తమ అభ్యర్థులకు కెసిఆర్, కిరణ్, చంద్రబాబు ధైర్యాన్ని నూరి పోశారు.