సోనియాకు డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా లేఖ
డిఎల్ రవీంద్రా రెడ్డిని బుజ్జగించేందుకు సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి తదితరులు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తాను నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్దేది లేదని రవీంద్రా రెడ్డి అంటున్నట్లు సమాచారం. కొద్ది మందిని బలి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తన లేఖలో చెప్పినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి సంక్షేమ పథకాలను ఎవరినీ సంప్రదించకుండా పెట్టారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో అందరూ రాజీనామా చేయాలని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది.
డిఎల్ రవీంద్రా రెడ్డి పార్టీని తీవ్ర సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్ష వైఖరిపై ఆయన తన లేఖలో తీవ్రంగా ధ్వజమెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మార్పునకు నాంది పలకాలని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన బుధవారమే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉప ఎన్నికలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్రికెట్తో పోల్చడం దురదృష్టకరమని డిఎల్ సోనియాకు రాసిన లేఖలో అన్నారు. రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయడానికి పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు అధికారమే పరమావధి కాకూడదని, దిగజారిపోతున్న పార్టీ ప్రతిష్టను కాపాడుకోవడానికి ఆలోచన చేయాలని ఆయన అన్నారు. నాయకత్వ మార్పుతో సమస్య పరిష్కారం కాదని, మనస్త్తత్వంలో మార్పు రావాలని ఆయన అన్నారు. ప్రభుత్వం నా అబ్బ సొత్తు అనుకుంటే ఇలాంటి సమస్యలే వస్తాయని, ఇప్పటికైనా అందరినీ కలుపుకుని పోవాలని ఆయన అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచి ఇదే పరిస్థితి ఉందని, యువ శానసశభ్యులు అంతర్మథనంలో ఉన్నారని డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు తాను మంత్రి పదవి ఏనాడూ అడగలేదని, అధిష్ఠానమే అవకాశం కల్పించిందని ఆయన అన్నారు. తాను ఒంటరిగానే పోరాడుతానని ఆయన చెప్పారు. తాను సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోరానని, అపాయింట్మెంట్ ఇవ్వగానే వెళ్లి కలుస్తానని ఆయన చెప్పారు.