పరకాలపై బిజెపి కన్ను: పోటీపై సందిగ్ధంలో కెసిఆర్?
ఇదే సమయంలో తెలంగాణలో పార్టీని పటిష్ట పరచాలనే ఉద్దేశ్యంతో బిజెపి ఉన్నట్లుగా తెలుస్తోంది. 2014లో తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ఇస్తామని బిజెపి బల్ల గుద్ది మరీ చెబుతోంది. దీంతో తెలంగాణ కోసమే తమ పోరాటమన్న కెసిఆర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత తగ్గినట్లుగా భావిస్తున్నారు. తెరాస కంటే తెలంగాణ ఇస్తామని చెబుతోన్న బిజెపిని గెలిపించడమే ఉత్తమమని ప్రజలు భావిస్తున్నారని బిజెపి అభిప్రాయపడుతోంది. దీంతో తెలంగాణలో పార్టీని పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా వచ్చే ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇటీవల చెప్పారు. ఇక నుండి తెలంగాణ పేరుతో రాజీనామాలు చేస్తే మద్దతివ్వమని, పోటీ చేస్తామని హెచ్చరిక జారీ చేశారు కూడా. పరకాల స్థానం నుండి బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డిని రంగంలోకి దింపే అంశాన్ని బిజెపి పరిశీలిస్తోంది.
మరోవైపు మ.నగర్లో తమపై బిజెపి గెలుపొందడాన్ని టిఆర్ఎస్ జీర్ణించుకోలేక పోతోంది. కొండా సురేఖ స్థానంతో ఖాళీ అయిన పరకాల స్థానంలో తాము పోటీ చేస్తే బిజెపి నుండి మరోసారి ఎదురు దెబ్బ తగులుతుందా అనే సందిగ్ధంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మైనార్టీలు అధికంగా ఉండే మ.నగర్ స్థానంలోనే బిజెపి గెలిచిందని, అలాంటి సమయంలో పరకాలలో అంద వీజీగా కొట్టి పారేయలేమని కెసిఆర్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈ స్థానంలో టిఆర్ఎస్ నుండి అభ్యర్థిని బరిలోకి దింపాలా లేక బిజెపి ఇప్పటికే తాము పోటీ చేస్తామని చెప్పినందు వల్ల ఆ పార్టీకి మద్దతివ్వాలా అని ఆలోచిస్తున్నారని అంటున్నారు. పరకాలలోనూ మ.నగర్ పరిస్థితే పునరావృతమైతే కష్టమేనని కొందరు టిఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారట. మ.నగర్లో జెఏసి తమకు అనుకూలంగా పని చేయలేదని, జెఏసి లేకుంటే పార్టీకి రాజకీయంగా నష్టమేననే ఆందోళన టిఆర్ఎస్ వర్గాల్లో తాజాగా కనిపిస్తోందని అంటున్నారు. కాగా మాజీ డిఎస్పీ నళిని తాను పరకాల నుండి పోటీ చేస్తానని జెఏసికి లేఖ రాశారు.