మ.నగర్‌లో బిజెపి గెలుపు: కెసిఆర్ వైఖరే కారణమా?

K Chandrasekhar Rao-BJP
మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి అద్భుత విజయం సాధించారు. కొవూరుతో సహా మిగిలిన అన్ని నియోజకవర్గాలలో గెలుపును అందరూ ఊహించిందే. అయితే మ.నగర్‌లోనూ అదే టిఆర్ఎస్ గెలుస్తుందని అందరూ భావించారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా తన సర్వేలో అదే చెప్పారు. తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ టిఆర్ఎస్ గెలుపు ఖాయమనుకున్నారు. అయితే అనూహ్యంగా ఫలితం తారుమారయింది. అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ బిజెపి విజయం సాధించింది. ఇటీవలి క్రితం వరకు అసలు పోటీకి దిగాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న బిజెపి ఏకంగా పాలమూరులో పాగా వేసింది. బిజెపి విజయానికి పలు కారణాలు చూపిస్తున్నారు. కెసిఆర్ వైఖరి, అభ్యర్థికి కలిసొచ్చిన సామాజికవర్గం, ప్రత్యర్థి పార్టీలలో క్రాస్ ఓటింగ్ ఇలా అనేక కారణాలు కనబడుతున్నాయంటున్నారు. మహబూబ్‌నగర్ ఎంపిగా గెలిచినప్పటి నుంచి మళ్లీ నియోజకవర్గం వైపు కెసిఆర్ కన్నెత్తి కూడా చూడకపోవడం, అదే సమయంలో జాతీయ పార్టీ అయిన బిజెపి కూడా తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించడంతో పాలమూరు ప్రజల దృష్టి అటువైపు మళ్లిందని అంటున్నారు. పైపెచ్చు, జెఏసిలో ఒక వర్గం బిజెపికి అండగా నిలవడం, టిఆర్ఎస్ అభ్యర్థి ఇబ్రహీంకు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉండటం లాంటివి కమలనాథులకు కలిసొచ్చాయని అంటున్నారు.

దివంగత ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గతంలో బిజెపి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. కానీ, ఆయన కుటుంబ సభ్యుల పట్ల కాంగ్రెస్‌పార్టీ అనుసరించిన వైఖరితో ఆయన అనుచరులు తీవ్ర మనస్తాపానికి గురై శ్రీనివాస రెడ్డికి బాసటగా నిలిచారు. ఆయన సామాజిక వర్గం కూడా అండగా నిలిచినట్లుగా కనిపిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సాగించిన తెలంగాణ పోరుయాత్ర సెంటిమెంటు పరంగా ఆదరణ పెంచింది. ఇక టిఆర్ఎస్ అధినేత స్థానిక ఎంపి కెసిఆర్ వ్యవహార శైలితో స్థానికులు విసిగి వేసారని అంటున్నారు. ఎంపిగా గెలిచినప్పటి నుంచి స్థానిక పర్యటనలు తక్కువయ్యాయన్న ఆరోపణలున్నాయి. ప్రతిసారీ ఎన్నికల పేరుతో రావడం తప్ప సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని అంటున్నారు. ఎంపి ఎన్నికల్లో కెసిఆర్‌కు 22 వేల మెజారిటీ వస్తే అప్పుడు మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేసిన ఇబ్రహీం 6వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అదే అభ్యర్థిని రంగంలోకి దించడం పైగా మైనారిటీ ఓటు బ్యాంకు కోసం ముస్లిం మత పెద్దల వద్దకు వెళ్లడం మిగతా వర్గాలను కొంత దూరం చేసిందని అంటున్నారు. దీనికి తోడు బిజెపి ఒక్క మహబూబ్‌నగర్‌లోనే పోటీ చేసి మిగతా ఐదు స్థానాల్లో టిఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించింది. కానీ ఇదే పని టిఆర్ఎస్ చేయలేక పోయింది. తెలంగాణ జెఏసిలో రెండు పార్టీలు భాగస్వాములైనందున టిఆర్ఎస్ తన అభ్యర్థిని పోటీ పెట్టకపోతే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మహబూబ్‌నగర్‌ను బిజెపికి వదలకుండా టిఆర్ఎస్ రంగంలోకి దిగడం న్యాయ సమ్మతం కాదని జెఏసి నేతలు మొహం మీదే చెప్పేశారని సమాచారం. పదకొండేళ్ల పాటు టిఆర్ఎస్‌లో పని చేసి బయటపడిన శ్రీనివాస్‌ రెడ్డి పట్ల ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. ఇలా అన్ని అంశాలు ఆయనకు కలిసి వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+