తెలంగాణపై రాజ్యసభలో కేంద్రంపై కేశవరావు నిప్పులు
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, మాట నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో కాంగ్రెసు అధిష్టానానికి అర్థమవుతోందా అని ఆయన అడిగారు. తమను చంపేస్తే సమస్య పరిష్కారమవుతుందనుకుంటే చంపేయాలని ఆయన ఆవేశంగా అన్నారు. మానసికంగా రాష్ట్రం ఎప్పుడో విడిపోయిందని ఆనయ అన్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రశాంతత గురించి మాట్లాడుతున్నారని, ప్రధాని చెప్తేనే సకల జనుల సమ్మెను విరమించామని ఆయన అన్నారు.
తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికలో పెట్టిన విషయాన్ని మరిచిపోయారా అని ఆయన అడిగారు. తెలంగాణపై శాసనసభలో తీర్మానం చేయడానికి అఖిల పక్ష సమావేశం అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన అడిగారు. తెలంగాణపై కమిటీ వేశారని, అయినా ఏమీ కాలేదని ఆయన అన్నారు. మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు తెలంగాణ కోసం రాజీనామ చేశారని ఆయన గుర్తు చేశారు. కొద్ది రోజుల్లో కేశవరావు రాజ్యసభ పదవీ కాలం ముగుస్తోంది. తిరిగి ఆయనను కాంగ్రెసు అధిష్టానం రాజ్యసభకు నామినేట్ చేయలేదు.