రేపు తెలంగాణ బంద్: బిజెపి, టిటిడిపి మద్దతు
తెలంగాణపై కేంద్రం ఇచ్చిన హామీ వెనక్కి తీసుకున్నందువల్లే తెలంగాణలో ప్రాణత్యాగాలు కొనసాగుతున్నాయని బిజెపి ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ అన్నారు. విద్యార్థులు, యువత ప్రాణత్యాగాలు చేయవద్దని పిలుపునిచ్చారు. అందరం కలిసి తెలంగాణ కోసం పోరాడదామని సూచించారు. ఆత్మత్యాగాలు కాకుండా పోరాడి తెలంగాణ సాధించుకుందామన్నారు. ఇంతమంది చచ్చిపోతుంటే అసెంబ్లీ ఎందుకని నాగం జనార్ధన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు ఆంధ్రోళ్ల అడుగులకు మడుగులొత్త వద్దని సూచించారు. ఇన్నాళ్లకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నోటి నుండి తెలంగాణ అన్న పదం వినిపించిందని అన్నారు. అధికార, ప్రతిపక్షాలకు బాధ్యత లేకుంటే సభ నుండి వెళ్లి పోవాలని అన్నారు. కాగా కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ ఢిల్లీలో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఆత్మహత్యలు వద్దని సూచించారు. మంగళవారం నాటి బందుకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు.