ఆజాద్ మాట వినలేదు, వినబోం: కాంగ్రెసు టి - ఎంపిలు
రేపు మరోసారి తమతో మాట్లాడుతామని ఆజాద్ చెప్పారని రాజయ్య అన్నారు. అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గ్రూపులు, సబ్ గ్రూపులు ఏర్పాటు చేసి కాంగ్రెసు పార్టీని బలహీనపరుస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ అంశం మరుగునపడిందని, రెండు సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, కానీ అలా జరగలేదని ఆయన అన్నారు. తెలంగాణపై వాయిదాలు పెడుతున్నారని, వాయిదాలు పెడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం లేదని, దీంతో కాంగ్రెసుపై నమ్మకం సన్నగిల్లుతోందని, అందుకే ఆరు స్థానాల్లో కూడా కాంగ్రెసు ఓడిపోయిందని మందా జగన్నాథం అన్నారు. తెలంగాణపై తేల్చే వరకు పార్లమెంటును స్తంభింపజేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభించాలని తాము ఆజాద్ను కోరినట్లు వివేక్ చెప్పారు.