టిడిపి నందమూరి ఫ్యామిలీదే: హరికృష్ణ, టార్గెట్ బాబే
నాయకుల వల్లనే పార్టీ నీరసపడిందన్నారు. పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుందన్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అన్నగారి పార్టీని మళ్లీ ప్రజలు అక్కున చేర్చుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు పల్లకిలో కూర్చుంటామంటే ఇక మోసే వారెవరని ఆయన ప్రశ్నించారు. పని చేయని నాయకుడిని నిలదీయాలన్నారు. ఇది కార్యకర్తల పని అన్నారు. ఈ పార్టీ ఎన్టీఆర్ మానస పుత్రిక అని, పార్టీలో ఎలాంటి లోపం లేదన్నారు. ఎన్టీఆర్కు ఎవరో చెబితే, ఎవరో నేర్పితే వచ్చిన పార్టీ కాదన్నారు. మూడువందలకు పైగా సినిమాల్లో నటించి ఎస్సీ, ఎస్టీ, బిసిల కోసం పార్టీని స్థాపించారన్నారు. తెలుగుదేశం నందమూరి కుటుంబానిదేనని ఆయన చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ అవసరమైన సమయంలో టిడిపికి సేవలందిస్తారన్నారు. ఎన్టీఆర్కు ఇంకా రాజకీయ అనుభవం కావాలన్నారు. మమ్మల్ని బయటకు పంపేంత వరకు టిడిపికి సేవ చేస్తామన్నారు. పార్టీని బతికించుకోవాల్సి ఉందన్నారు. ఓ వైపు కాంగ్రెసు పార్టీ నేతలతో కొందరు నేతలు వ్యాపారం చేసుకుంటున్నారని విమర్సించారు. కాంగ్రెసుతో చేసే వ్యాపారాలను పార్టీ అధినేతలు అడ్డుకోవాలన్నారు. కాగా టిడిపి కాంగ్రెస్తో కుమ్మక్కైందన్న జగన్ వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు.
కాగా చంద్రబాబుపై పార్లమెంటు సభ్యుడు నందమూరి హరికృష్ణ బుధవారం మరోసారి అలిగిన విషయం తెలిసిందే. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తికి గురైన ఆయన చంద్రబాబుపై అలిగినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిడిపిపి) కార్యాలయం వెలుపల కూర్చుని ఆయన తన నిరనసను తెలియజేశారు. తెలుగుదేశం వ్యాపారవేత్తల పార్టీ అయిందని ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.