జగన్ పర్యటనలో అపశృతి: కార్యకర్తలపై సెక్యూరిటీ దాడి
ఈ సమయంలో జగన్ సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించింది. అభిమానంతో జగన్ను చూసేందుకు వచ్చిన వారిపై దాష్టీకం చేసింది. వారిని అదుపు చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది అభిమానులతో దురుసుగా ప్రవర్తించింది. అభిమానులపై ముష్టిఘాతాలు కురుపించింది. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది దాడిలో పలువురు అభిమానులు స్వల్పంగా గాయపడ్డారు. అభిమానులు జై జగన్, జై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు జగన్ మాట్లాడుతుండగా సెక్యూరిటీ సిబ్బంది ఓ జర్నలిస్టును వేదిక పైనుండి తోసేశారు. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. జగన్ సెక్యూరిటీ సిబ్బందిని వారించారు.
కాగా అంతకుముందు మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా సీనియర్ రాజకీయ నేత హరిరామజోగయ్య వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హరిరామజోగయ్య కాంగ్రెసు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో జగన్తో పాటు జోగయ్య కూర్చున్నారు. నాలుగైదు రోజుల క్రితం హరిరామజోగయ్య జగన్ పార్టీలో చేరతారనే వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. అవి నిజమేనన్నట్లు ఆయన మూడు రోజల క్రితం రాజ్యసభ సభ్యుడు చిరంజీవిపై ధ్వజమెత్తారు. అదే సమయంలో జగన్కు కితాబు ఇచ్చారు. ఈరోజు ఆయన జగన్ పార్టీలో చేరారు.
కాగా రాబోయే ఉప ఎన్నికల్లో పద్దెనిమిది స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే విజయం సాధిస్తుందని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయన ప్రకాశం జిల్లా ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. తాను అధికారంలోకి వస్తే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు తొలగిస్తానని బాబు పగటి కలలు కుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు, టిడిపి ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు.