జూన్ 15తర్వాత కేంద్రంతో యుద్ధమే.. ఐ డోంట్ కేర్: తేల్చి చెప్పిన సీఎం రేవంత్
జూన్ 15 తర్వాత కేంద్రంతో యుద్ధం చేస్తామని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుమురంభీం జిల్లా కాగజ్నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం, రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్లు వంటి అంశాలపై ముఖ్యమైన ప్రకటనలు చేశారు.
ధాన్యం కొనుగోలుపై రైతులు ఆందోళన చెందొద్దు
రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని పంటలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని, ఎవరూ నిరాశ చెందకూడదని భరోసా ఇచ్చారు. ఇప్పటికే 60 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మరో 15 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేస్తామన్నారు. అయితే కేంద్రం కేవలం 40 లక్షల క్వింటాళ్లు మాత్రమే తీసుకుందని, పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఇచ్చే ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వడం లేదని విమర్శించారు.

జూన్ 15 తర్వాత జరిగేదిదే.. కేంద్రమంత్రులకు హెచ్చరిక
జూన్ 15 లోగా కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ , కిషన్ రెడ్డి ఇంటి ముందు ధాన్యం కుప్పలు పోసి నిరసన తెలుపుతామని సీఎం హెచ్చరించారు. ఇది కేంద్రంపై యుద్ధంగా మారుతుందని, రైతుల ఉద్యమం ఉప్పెనగా మారి కిషన్ రెడ్డికి తెలంగాణలో తిరగడం కూడా కష్టమవుతుందని హెచ్చరికలు జారీ చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగం
రాష్ట్రంలో ఇళ్లులేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే 1.25లక్షల ఇళ్ల గృహప్రవేశాలు చేశామని, సెప్టెంబరు 17న మరో లక్ష ఇళ్లను అందజేస్తామని ప్రకటించారు. రెండో విడతలో 2.5లక్షల ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో నిర్మాణం వేగవంతం చేసి, రాజకీయాలకు అతీతంగా అందరికీ ఇళ్లు ఇవ్వాలని సూచించారు. గత ప్రభుత్వాలు మధ్యలో వదిలేసిన ఇళ్లను కూడా పూర్తి చేసి అందిస్తామన్నారు.
తుమ్మిడిహెట్టి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై పంచాయితీ కోరుకోవట్లేదు
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్ స్పందించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నిశ్శబ్దం వహించడం విచారకరమని అన్నారు. రెండు వేల ఎకరాల భూమి కేటాయింపు విషయంలో మహారాష్ట్రను ఒప్పించాలని, లేకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. "పంచాయితీ కోరుకోవడం లేదన్నారు, సమస్య పరిష్కారం కోరుకుంటున్నాం. లేకపోతే ఎవరైనా సరే ఐ డోంట్ కేర్" అని స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications