ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలో బాబు టార్గెట్ జగన్, అరెస్ట్

రాజధాని హైదరాబాదులో ఎప్పుడు విద్యుత్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. హైదరాబాదులోనే ఇలా ఉంటే గ్రామాల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందన్నారు. నాలుగేళ్ల వరుస కరవులోనూ ఎలాంటి కోత లేకుండా తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చిన ఘనత తమదేనన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా రావాలంటే విద్యుత్ సరఫరా కీలకమన్నారు. గత మూడేళ్లుగా విద్యుత్ ఛార్జీలను పెంచుతూనే ఉన్నారని విమర్శించారు. సేవా పన్ను పేరుతో సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు.
విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.17 వేల కోట్ల అప్పులున్నాయన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పైనా ఆయన మండిపడ్డారు. జగన్ తులసి మొక్క కాదని గంజాయి మొక్క అన్నారు. ప్రభుత్వం కనివినీ ఎరుగని రీతిలో ఛార్జీలు పెంచుతోందన్నారు. మాకెందుకులే అని అనుకుంటే బతకటం కష్టమన్నారు. ప్రభుత్వం అసమర్థత వల్లే విద్యుత్ సంక్షోభం అన్నారు.
జగన్ ఐదేళ్లలో తన తండ్రి అధికారం అడ్డుగా పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించారని దుయ్యబట్టారు. ఆయనకు దమ్ముంటే 2004కు ముందు తన ఆస్తి ఎంత ఇప్పుడు ఎంతో ప్రజల ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా విద్యుత్ పెంపుని నిరసిస్తూ చంద్రబాబు గగన్పాడు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు బాబును, పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి శంషాబాద్ పోలీసు స్టేషన్ కు తరలించారు.












Click it and Unblock the Notifications