"రాష్ట్రంలో మరో నాలుగైదు రోజుల పాటు వర్షాలు"
తెలంగాణలో కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా పగటిపూట ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఎండలు.. మరోవైపు వడగాల్పుల కారణంగా ప్రజలు బయటకు వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. అయితే గత రెండు రోజులుగా సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నమోదవుతోంది. దాంతో రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వేడిగా ఉన్న భూభాగం మీదకు తేమ గాలులు ప్రవేశించడం వల్ల అకాల వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వివరించింది. వీటిని వేసవికాలంలో కురిసే ప్రీ- మాన్ సూన్ సీజన్ లో కురిసే జల్లులంటారని పేర్కొంది. రానున్న నాలుగైదు రోజుల పాటు అకాల వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ సైతం జారీ చేశారు. అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని వాతావరణ కేంద్రం వివరించింది. ఇక ఇదే విషయంపై వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. గత నాలుగు రోజుల నుంచి తెలంగాణలో హీట్ వేవ్ వాతావరణం ఉత్తర, తూర్పు తెలంగాణలో కొనసాగుతోందన్నారు. అలాగే దక్షిణ, పశ్చిమ తెలంగాణలో చిరు జల్లుల వాతావరణం కొనసాగుతోందని పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో అకాల వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అకాల వర్షాల కారణంగా కల్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచనలు చేశారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇక మంగళవారం రాత్రి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసిన విషయం తెలిసిందే. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు మండిపోయాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. అయితే సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపరిపీల్చుకున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్, బోయిన్పల్లి, బాలానగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్ సుఖ్ నగర్, లక్డీకాపూల్, అమీర్ పేట్, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో స్వల్పంగా వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications