భారత్ ఐదోతరం స్టెల్త్ యుద్ధవిమానం వచ్చేస్తోంది.. పాక్, చైనా చిత్తుచిత్తే..!
భారత్ కు చెందిన ప్రతిష్టాత్మక ఐదోతరం యుద్ధ విమాన ప్రాజెక్ట్ అయిన AMCA ఫైటర్ జెట్ కు సంబంధించి కీలక ముందడుగు పడింది. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ దేశంలోని మొట్టమొదటి స్వదేశీ ఐదోతరం స్టీల్త్ యుద్ధ విమాన ప్రాజెక్ట్(AMCA) కోసం అధికారికంగా రిక్వెస్ట్ ఫర్ ప్రొపోజల్ జారీ చేసింది. ఈ రేసులో షార్ట్ లిస్ట్ చేసిన మూడు ప్రముఖ ప్రైవేట్ పరిశ్రమల కూటములకు కేంద్ర రక్షణశాఖ ఈ ప్రతిపాదనలను పంపింది. షార్ట్ లిస్ట్ చేసిన సంస్థల వివరాలు చూస్తే.. లార్సెస్ అండ్ టూబ్రో- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గ్రూప్, టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్, భారత్ ఫోర్జ్- బీఈఎంఎల్ కూటమి ఉన్నాయి.
ఇక AMCA నమూనాల తయారీ, అభివృద్ది కోసం ప్రభుత్వం రూ. 1500 కోట్లను కేటాయించింది. అయితే పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన తొలి దశ అవసరాల కోసం దాదాపు 120 AMCA యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ఉంది. ఈ ప్రణాళిక ప్రకారం.. ఈ ఫైటర్ జెట్ ప్రోటొటైప్ అభివృద్ధిని 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత 2035 నాటికి AMCA జెట్స్ మొదటి స్క్వాడ్రన్ భారత అమ్ముల పొదిలో చేరే అవకాశం ఉంది.

ఇక ఇటీవల కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు సంయుక్తంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ప్రాంతంలో ఈ AMCA ప్రోగ్రామ్ కు అనుసంధానంగా ఉండే ఒక భారీ రక్షణ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. సుమారు రూ.16000 కోట్ల విలువైన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా దేశ రక్షణ ఉత్పాదక సామర్థ్యం పెరగడమే కాకుండా.. స్థానికంగా దాదాపు 7,500 ఉద్యోగాల వరకు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications