తెలంగాణపై సోనియా: సిఎం మార్పు, ఢిల్లీలోనే కెసిఆర్?
సమస్య పరిష్కారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఢిల్లీలోనే ఉండాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం సూచించినట్లుగా తెలుస్తోంది. మంగళవారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో శాసనమండలి సభ్యుడు డి శ్రీనివాస్ భేటీలో ప్రధానంగా తెలంగాణ అంశమే చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షురాలు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహల అభిప్రాయాలను అధిష్టానం ఈ రోజు తెలుసుకోనుందని అంటున్నారు. కెసిఆర్ను కూడా ప్రత్యేక ప్యాకేజీపై ఒప్పించేందుకు ప్రయత్నాలు చేయవచ్చునని తెలుస్తోంది.
అంతా అధిష్టానం అనుకున్నట్లుగా జరిగితే ప్యాకేజీలో కిరణ్ కుమార్ రెడ్డిని మార్చి తెలంగాణ నేతకు ముఖ్యమంత్రి పదవి అప్పగించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే డి శ్రీనివాస్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహల పేర్లు ముఖ్యమంత్రి పదవికి వినిపిస్తున్నాయట. తెలంగాణ సమస్యను తేల్చేసి ఆ తర్వాత సీమాంధ్రలో జగన్ పైన దృష్టి పెట్టాలని అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. మొత్తానికి తెలంగాణపై సమావేశాలకు ముందే అధిష్టానం కీలక నిర్ణయం ప్రకటించనుందనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ సమస్య తర్వాత జగన్, ఉప ఎన్నికలు, పార్టీలోని ముఖ్య నేతల మధ్య విభేదాలపై పార్టీ పెద్దలు చర్చించనున్నట్లు సమాచారం. కాగా పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెరాస చీఫ్ కెసిఆర్ను ఢిల్లీలోనే ఉండమని అధిష్టానం చెప్పడం శుభపరిణామం అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికే పార్టీ అలా చెప్పిందన్నారు. వైయస్ జగన్ను అవినీతిమంతుడిగా చిత్రీకరించడం కోసం దివంగత వైయస్ను తప్పు పట్టడం సరికాదని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలోని నిబంధనల ప్రకారమే వైయస్ భూకేటాయింపులు చేశారన్నారు.