తెలంగాణ ఇష్యూపైనే చంద్రబాబు ఢిల్లీ యాత్ర?
రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికలు, రాష్ట్ర కాంగ్రెసు పరిస్థితులు తదితర విషయాలపై కాంగ్రెసు అధిష్టానం పెద్దలు చర్చించడంతో పాటు తెలంగాణ సమస్యపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు బుధవారం మధ్యాహ్నం నుంచి వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన సీనియర్ నేత, పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మంగళవారమే ఢిల్లీ వెళ్లి సోనియాను కలిశారు. ఆయన అక్కడే ఉన్నారు.
బుధవారం ఉదయం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కెసిఆర్ను కూడా అందుబాటులో ఉండాలని సోనియా కోరినట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ సమస్యను పరిష్కరించే ఉద్దేశంతోనే కాంగ్రెసు అధిష్టానం వారందరినీ ఢిల్లీకి పిలిపించినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో చంద్రబాబు కూడా వెళ్లడం కూడా అదే విషయంపై అయి ఉంటుందని ప్రచారం సాగుతోంది. సీనియర్ రాజకీయ నాయకుడిగా తెలంగాణ సమస్యను పరిష్కరించే బాధ్యత తనపై ఉందని ఇటీవల ఆయన పదే పదే చెప్పారు. తెలంగాణపై కచ్చితమైన పరిష్కారానికి తాను చర్చలు జరుపుతున్నట్లు కూడా చెబుతున్నారు. అందువల్ల ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై రాష్ట్రానికి చెందిన ప్రధాన రాజకీయ పార్టీలతో టచ్లో ఉన్నామని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఇటీవల చెప్పారు. అందులో భాగంగానే చంద్రబాబు ఢల్లీ పర్యటన చోటు చేసుకుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తిరిగి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే లోగా తెలంగాణకు పరిష్కారం కనుక్కోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ అంశంపై లోకసభ కార్యక్రమాలు స్తంభిస్తూ వచ్చాయి. తెరాస పార్లమెంటు సభ్యులు కెసిఆర్, విజయశాంతిలతో పాటు తెలంగాణకు చెందిన కాంగ్రెసు, తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు కూడా లోకసభ సమావేశాలను అడ్డుకుంటూ
వచ్చారు. తిరిగి సమావేశాలు ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి ఎదురు కావచ్చునని అంటున్నారు. దీంతో ఈలోగానే ఏదైనా పరిష్కారం చూడాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉందని,త అది కేంద్ర ప్రభుత్వపరంగా జరుగుతుందని అంటున్నారు.