2014పై దృష్టి సారించిన రాహుల్, నేతలతో నేడు భేటీ

ఫలితాలు వెలువడిన అనంతరం తొలిసారి రాహుల్ యుపి కాంగ్రెసు నేతలతో గురువారం భేటీ అవుతున్నారు. అపజయం కారణంగా పార్టీ నేతల్లో ఉన్న నిర్లిప్తతను తొలగించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. తన భేటీకి ఆయన కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను, ఇరవై వేలు అంతకంటే ఎక్కువ ఆధిక్యతతో ఓడిపోయిన నేతలను ఢిల్లీకి పిలిపించారు.
కొందరు పార్టీ నేతలు గెలిచే అవకాశాలు లేని తమ వారికి టిక్కెట్లు ఇప్పించుకోవడం, ప్రచారం సమయంలో పలువురు నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ విజయావకాశాలను దెబ్బతీశాయని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటివి 2014 లోకసభ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చేయాలని రాహుల్ భావిస్తున్నారని తెలుస్తోంది.
కాగా ఈ సమావేశానికి ఏఐసిసి జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ గైర్హాజరు కానున్నారు. ఇతను విదేశీ పర్యటనలో ఉన్నారు. దిగ్విజయ్ ఉత్తర ప్రదేశ్ పార్టీ ఇంచార్జ్. యుపిలో ఓటమికి తానే బాధ్యత వహిస్తానని రాహుల్ గాంధీ చెప్పిన విషయం తెలిసిందే. కాగా 2009 లోకసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారం చేసి 80 సీట్లకు గాను 22 సీట్లలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించారు.












Click it and Unblock the Notifications