ఇప్పుడేం ఓదార్పు: వైయస్ జగన్పై బొత్స విసుర్లు

జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు కేవలం కుటుంబ పార్టీలని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ ఒక్కటే జాతీయ పార్టీ అని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో తాము వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేయాలని తాము అనుకోవడం లేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్న ప్రభుత్వాన్ని అధికార దాహంతో వైయస్ జగన్ కూల్చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రులందరిదీ బాధ్యతేనని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తమ కాంగ్రెసు పార్టీ నాయకుడేనని ఆనయ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై వచ్చినవన్నీ ఆరోపణలేనని ఆయన అన్నారు. వాటిపై విచారణ జరుగుతోందని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యక్రమాల్లో వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటో పెట్టకపోవడం అసాధారణమేమీ కాదని ఆయన అన్నారు.
రానున్న 18 స్థానాల ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బొత్స సత్యనారాయణ అప్పుడే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన మంగళవారం నుంచి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వైయస్ జగన్ స్వార్థం వల్లనే ఉప ఎన్నికలు వచ్చాయని ఆయన మంగళవారం విమర్శించారు.
కాగా, బొత్స పర్యటన సందర్భంగా పార్టీలోని అసంతృప్తులు బయటపడ్డాయి. జిల్లాకు చెందిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ ఆయన పర్యటనకు దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై డిఎల్ రవీంద్రా రెడ్డి గుర్రుగా ఉన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఆయన సోనియా గాంధీకి లేఖను పంపించారు. వైయస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శించడాన్ని సాయి ప్రతాప్ వ్యతిరేకిస్తున్నారు.












Click it and Unblock the Notifications