విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయండి: సిబిఐ పిటిషన్

విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో సిబిఐ హౌస్ మోషన్ మూవ్ పిటిషన్ను దాఖలు చేసింది. సిబిఐ పిటిషన్ను హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వీకరించలేదు. సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు. ఆయన సూచనల మేరకు సిబిఐ సోమవారం హైకోర్టులో విజయ సాయి రెడ్డి బెయిల్ పైన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
కాగా జగన్ ఆస్తుల కేసులో మూడు నెలల క్రితం అరెస్టైన విజయ సాయి రెడ్డికి సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన అదే రోజు సాయంత్రం జైలు నుండి విడుదల అయ్యారు. జైలు నుండి విడుదల అిన అనంతరం విజయ సాయి రెడ్డి జగన్ ఆస్తుల కేసు తదితర అంశాలపై మాట్లాడేందుకు నిరాకరించారు.
శనివారం ఉదయం ఆయన జగన్మోహన్ రెడ్డితో సుదీర్ఘ సమయంపాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి సిబిఐ ఎలా వ్యవహరించింది, జగన్ అరెస్టు అవకాశాలు ఎలా ఉన్నాయన్న పలు అంశాలపై చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. లోటస్ పాండుకు వచ్చిన విజయ సాయి మీడియాతో మాట్లాడారు. తాను వైయస్ జగన్ విషయం మాట్లాడబోనని చెప్పారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసు గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు. జైలు జీవితం దుర్భరమైందని ఆయన అన్నారు. సిబిఐ తన పని తాను చేసుకు పోతోందని ఆయన అన్నారు. సిబిఐ తన బాధ్యత నెరవేరుస్తోందని ఆయన చెప్పారు. బెయిల్ ఇచ్చినందుకు ఆయన న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications