ఆజాద్తో కానిది వాయలార్ రవితో అవుతుందా?

ముఖ్యమంత్రి పదవి నుంచి కె. రోశయ్యను దించి కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టిన తర్వాత సమస్యలు తగ్గకపోగా మరింత పెరిగాయి. పిసిసి అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్ ఉన్నప్పుడు దాదాపుగా పార్టీకి, ప్రభుత్వానికి మధ్య, ముఖ్యమంత్రికీ పిసిసి అధ్యక్షుడికీ మధ్య విభేదాలు ఉన్న జాడలు కనిపించలేదు. డి. శ్రీనివాస్ ఎలా వ్యవహరించేవారో తెలియదు గానీ దూకుడు ఎప్పుడూ ప్రదర్శించలేదు. ముఖ్యమంత్రి పదవిపై ఆశ పడినట్లు కూడా కనిపించలేదు. కానీ బొత్స సత్యనారాయణను పిసిసి అధ్యక్షుడిగా చేసిన వెంటనే కాంగ్రెసులోని పాత సంప్రదాయం మళ్లీ ముందుకు వచ్చింది.
కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడికీ ముఖ్యమంత్రికీ పడకపోవడమనేది పార్టీ సంప్రదాయంగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణకు, కిరణ్ కుమార్ రెడ్డికి ఏ మాత్రం పొసగడం లేదు. పైగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అసంతృప్తులను కూడగడుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. వచ్చే ఉప ఎన్నికల్లో గెలవడం మాట అటుంచి, ఈ ఇద్దరికి మధ్య సయోధ్య కుదుర్చడం, పార్టీని ఏక తాటి మీదికి తేవడం అనేది సాధ్యమవుతుందా అనేది ప్రశ్న. ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుడిని, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ఢిల్లీకి పిలిచి ఆజాద్ క్లాస్ తీసుకున్నారు. అప్పటికప్పుడు ముగ్గురు కలిసి పోయినట్లే కనిపించారు. కానీ, వరుస మారలేదు.
నిజానికి, రాష్ట్ర వ్యవహారాలను చక్కదిద్దడంలో ఆజాద్ సరైన నాయకుడని భావిస్తూ వస్తున్నారు. కానీ, ఆయన వల్ల కాలేదనే వాయలార్ రవిని సోనియా రంగంలోకి దింపినట్లు చెబుతున్నారు. వాయలార్ రవి కూడా ఇది వరకు రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీగా పనిచేశారు. అందువల్ల ఆయనకు రాష్ట్ర పరిస్థితులు తెలిసే ఉంటాయని, రాష్ట్ర కాంగ్రెసు నాయకులతో పరిచయాలు బాగానే ఉండి ఉంటాయని అనువకోవచ్చు. కానీ, ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దే పని ఆయనతో అవుతుందా అనేది ప్రశ్నగానే మిగులవచ్చు.
రాష్ట్రంలో 18 శాసనసభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. క్షేత్ర స్థాయిలో పార్టీని ఉప ఎన్నికలకు సమాయత్తం చేయడానికే తాను వచ్చానని వాయలార్ రవి అంటున్నారు. ఆయన ఈ మూడు రోజులు కలిసే నాయకుల అబిప్రాయాల మీదనే ఆధారపడే అవకాశం ఉంది. వారు చెప్పే విషయాలు కొత్తవేమీ కావు. కాంగ్రెసు నాయకులు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు ఆజాద్ ముందు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. సమిష్టి బాధ్యత కోసం సమన్వయ కమిటీ కూడా వేశారు. మాట వరుసకి రెండు సమావేశాలు జరిగాయి. మరో సమావేశం జరుగుతుందనే గ్యారంటీ లేదు. అందువల్ల వాయలార్ రవి పార్టీని గాడిలో పెట్టడానికి తలకిందుల తపస్సు చేయాల్సిందేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications