వైయస్పై విమర్శలు: వాయలార్ రవికి వివేకా ఫిర్యాదు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అవినీతిలో వైయస్ రాజశేఖర రెడ్డికి కూడా పాత్ర ఉందని, వైయస్ రాజశేఖర రెడ్డికి తెలిసే వైయస్ జగన్ అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని కాంగ్రెసులోని పలువురు రాష్ట్ర కాంగ్రెసు నాయకులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో వైయస్ రాజశేఖ రెడ్డి వల్ల దళితులకు న్యాయం జరగలేదని కాంగ్రెసులోని దళిత నేతలు విమర్శలు చేస్తున్నారు. మంత్రి కొండ్రు మురళి, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ వంటి నాయకులు ఇటువంటి విమర్శలు చేస్తున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించడం పట్ల ఇప్పటికే వైయస్ వివేకానంద రెడ్డి వ్యతిరేకించారు. అలాగే, రాజంపేట కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ కూడా తప్పు పట్టారు. వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించాల్సి వస్తే తాను రాజకీయాల్లో ఉండబోనని ఆయన అన్నారు. మంత్రులు రఘువీరారెడ్డి వంటివారు వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలను వ్యతిరేకిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై కొండ్రు మురళి విమర్శించడంపై మరో మంత్రి వట్టి వసంత కుమార్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు.
కాగా, ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్ కూడా వాయలార్ రవిని కలిశారు. తనను పరకాల పరిస్థితి గురించి వాయలార్ రవి అడిగారని ఆయన చెప్పారు. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందని, తెలంగాణ ఏర్పాటుకు ప్రకటన చేస్తేనే తెలంగాణలో పార్టీ బతుకుతుందని తాను చెప్పానని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు బుధవారం వాయలార్ రవిని కలుసుకుంటారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మంగళవారం మీడియా ప్రతినిధులతో ఆ విషయం చెప్పారు.
తమది సింగిల్ ఎజెండా అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాలని తాము వాయలార్ రవిని కోరుతామని ఆయన చెప్పారు. రేపు సమావేశమైన అనంతరం తామంతా కలిసి వాయలార్ రవి వద్దకు వెళ్తామని ఆయన చెప్పారు. మంగళవారం కొంత మంది పార్లమెంటు సభ్యులు కలిసినప్పుడు రేపు కలిసికట్టుగా వాయలార్ రవి వద్దకు వెళ్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications